08-10-2024 NORMAL NEWS 12:22 PM
swarnodayam.com
Telugu Daily News
08-10-2024 12:22 PM By Mandala Yadagiri

అర్హులైన ఓటర్లు విధిగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి.. -రాష్ట్ర ఎన్నికల అధికారి

అర్హులైన ఓటర్లు విధిగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి.. -రాష్ట్ర ఎన్నికల అధికారి
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్ అక్టోబర్ 8: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ జాబితా రూపకల్పన నిబంధనల ప్రకారం చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి గ్రాడ్యుయేట్ , టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఓటరు రూపకల్పన పై జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, వరంగల్- ఖమ్మం -నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉందని, వీటి భర్తీ కోసం ఓటరు జాబితా రూపకల్పన నిబంధనల ప్రకారం చేపట్టాలని కలెక్టర్లకు సీఈఓ ఆదేశించారు. ఓటర్ నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ స్థానాలు, ఓటర్ నమోదు పై అక్టోబర్ 16, అక్టోబర్ 25న పలు పత్రికలలో నోటీసు జారీ చేయాలని అన్నారు.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలలో పాల్గొనేందుకు అర్హులైన ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో నవంబర్ 6 లోపు నమోదు చేయాలని అన్నారు
ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితాలను ఎన్నికల ముందు ప్రతిసారి కొత్తగా తయారు చేస్తామని, గతంలో ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వ్యక్తులు కూడా తప్పనిసరిగా ఉపాధ్యాయులు ఫారం 19 ప్రకారం, పట్టభద్రులు ఫారం 18 ప్రకారం నూతనంగా దరఖాస్తును నవంబర్ 6 లోపు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు.1 నవంబర్ 2024 ముందు 6 సంవత్సరాలలో కనీసం మూడు సంవత్సరాల పాటు సెకండరీ స్కూల్ కంటే తక్కువ స్థాయి కాకుండా విద్యా బోధనలో నిమగ్నమై ఉన్న ఉపాధ్యాయులు, 1 నవంబర్,2024 కంటే 3 సంవత్సరాల క్రితం (1 నవంబర్ 2021) నాటికి డిగ్రీ లేదా సమాన స్థాయి విద్య పూర్తి చేసుకున్న పట్టభద్రులు ఓటరుగా నమోదు కావడానికి అర్హులని తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు, పట్ట బద్రులుతమ దరఖాస్తులను సంబంధిత సర్టిఫికెట్లను జత చేస్తూ ఫారం 19 ప్రకారం తహసిల్దార్ కార్యాలయం, రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో మాన్యువల్ గా లేదా ceotelangana.nic.in అనే వెబ్ సైట్ లో ఆన్లైన్ ద్వారా నవంబర్ 6 లోపు దరఖాస్తు తీసుకుంటారని తెలిపారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్ 23 న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రచురించాలని, డిసెంబర్ 9 లోపు డ్రాఫ్ట్ జాబితా పై అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్ 25 లోపు పరిష్కరించాలని, డిసెంబర్ 30న తుది ఓటర్ జాబితా ప్రచురించాల్సి ఉంటుందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు గడువు పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, జిల్లాలోని డిగ్రీ ప్రొఫెషనల్ కాలేజీల , ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు , అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటర్ గా నమోదు చేసుకునేలా చూడాలని అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, ఆర్డీఓలు మహేశ్వర్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!