15-10-2024 NORMAL NEWS 12:34 PM
swarnodayam.com
Telugu Daily News
15-10-2024 12:34 PM By Mandala Yadagiri

జర్నలిస్టు యూసూఫ్ పై పెట్టిన అక్రమ కేసు వెంటనే ఎత్తివేయాలి -రాజన్న సిరిసిల్ల ఎస్పీని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

జర్నలిస్టు యూసూఫ్ పై పెట్టిన అక్రమ కేసు వెంటనే ఎత్తివేయాలి -రాజన్న సిరిసిల్ల ఎస్పీని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
IMG-20241015-WA0332

స్వర్ణోదయం ప్రతినిధి ,సిరిసిల్ల,అక్టోబర్ 15: జర్నలిస్టు ఎండి యూసుఫ్ పై చందుర్తి పోలీసులు పెట్టిన అక్రమ కేసును తొలగించి, జైల్లో వున్న అతనిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పెరుక రవి, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు, మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి ఎం.గోపాల్ తదితరులు రాజన్న సిరిసిల్ల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ కిమ్లా నాయక్ లను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా వారు అదనపు కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల పోలీసులు ఇటీవల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్, సిరిసిల్ల జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడైన జర్నలిస్టు ఎండి యూసుఫ్ కు సంబంధంలేని ఒక కేసును అంటగట్టి అతనిపై అక్రమంగా కేసు నమోదు చేశారని తెలిపారు. యూసుఫ్ పై పెట్టిన తప్పుడు కేసును ఉపసంహరింపజేసి, అతనిని వెంటనే విడుదల చేయాలని కోరారు. తప్పు చేయని జర్నలిస్టులపై ఇలా తప్పుడు కేసులు పెట్టడం తగదని, ఈ సంఘటనపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించి జర్నలిస్టు యూసుఫ్ పై తప్పుడు కేసు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులపై అక్రమ కేసులు ఉండవని భావించామని, కానీ అక్రమ కేసుల బనాయింపులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ, జర్నలిస్టు యూసుఫ్ పై చందుర్తి పోలీసులు అక్రమ కేసు పెట్టడం సహించరానిదని అన్నారు. యూసుఫ్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని,అతనిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కార్యదర్శి కె బాపురావు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పెరుక రవి, మహబూబ్ నగర్ కార్యదర్శి గోపాల్, వేములవాడ అధ్యక్షులు కొప్పుల ప్రసాద్, కార్యదర్శి, నరేందర్, నాయకులు సురేందర్, బిక్షపతి, తోట శేఖర్, చింతల శ్రీనివాస్, షరీఫ్, సత్యం, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!