17-11-2024 NORMAL NEWS 06:45 AM
swarnodayam.com
Telugu Daily News
17-11-2024 06:45 AM By Mandala Yadagiri

అధికార లాంఛనాలతో మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు పూర్తి!

అధికార లాంఛనాలతో మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు పూర్తి!
IMG-20241117-WA0100

స్వర్ణోదయం ప్రతినిధి, అమరావతి, నవంబర్ 17:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు తమ స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో తమ తల్లిదండ్రుల సమాధుల చెంతనే సోదరుడి అంత్యక్రియలు పూర్తిచేశారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో నారావారిపల్లికి తరలివచ్చారు. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు, చంద్రబాబు సన్నిహితమిత్రులు, నందమూరి కుటుంబానికి చెందిన ప్రముఖులు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు హాజరయ్యారు.

రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల సమయంలో తన తండ్రిని చివరిసారి చూసుకుంటూ నారా రోహిత్ వెక్కివెక్కి ఏడవడం అందరినీ కంటతడి పెట్టించింది. మా నాన్న మా కోసం ఎంతో చేశారంటూ నారా రోహిత్ అభిప్రాయ పడ్డారు. ఎక్స్ ద్వారా నారా రోహిత్ విడుదల చేసిన ఓ ఎమోషనల్ నోట్ ఆయనకు తండ్రి మీదున్న ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంతిమ నివాళి అర్పించారు. చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లికి రామ్మూర్తి నాయుడు పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. అనంతరం అక్కడికి వివిధ పార్టీల నేతలు, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు, మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి వరుసగా నివాళి ఘటించారు. రామ్మూర్తి నాయుడి తనయుడు, ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్‌కు, ఆయన సోదరుడు నారా గిరీష్‌కు తాము అండగా ఉన్నామని చంద్రబాబునాయుడు ధైర్యం చెప్పి ఓదార్చారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!