21-03-2025 NORMAL NEWS 11:02 PM
swarnodayam.com
Telugu Daily News
21-03-2025 11:02 PM By Mandala Yadagiri

సన్న బియ్యం పంపిణీకి ముహూర్తం ఖరారు!.. ఉగాది నుండి రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.

సన్న బియ్యం పంపిణీకి ముహూర్తం ఖరారు!.. ఉగాది నుండి రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.
IMG-20250321-WA0169

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు (White Ration Card) దారులకు ప్రభుత్వం పండగలాంటి వార్త చెప్పింది. ఉగాది నుంచి రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ (Rice Distribution) చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్నిబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉగాది రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజ అనంతరం సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారు. మటంపల్లి ఆలయంలో పంచాంగ శ్రావణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్‌ షాపుల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రేషన్‌ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీని మటంపల్లిలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం స్థల ఎంపికకు చర్యలు తీసుకున్నామని, అన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని పేద, దిగువ మధ్య తరగతి వర్గాల కోసం చారిత్రక నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. కుటుంబంలో ఎంత మంది ఉంటే ఒకొక్కరికీ 6 కిలోల చొప్పున అందజేస్తారు. అయితే, ప్రస్తుతం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం తినడానికి అనువుగా ఉండడం లేదు. రేషన్‌కార్డుదారుల్లో దాదాపు 85 శాతం మంది ఆ బియ్యాన్ని కిలోకు రూ.10 చొప్పున బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుని, సన్న బియ్యం కొనుక్కుంటున్నారు. ఆ బియ్యాన్ని మరింతగా పాలిష్‌ చేసి, సన్న బియ్యంగా మార్చడం ద్వారా దళారులు భారీగా లాభపడుతున్నారు.

దీంతో రేషన్‌కార్డుదారులకు దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం ఇస్తే.. నూటికి నూరు శాతం మంది తినడానికి వినియోగించుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. అది కూడా ఉచితంగా ఇస్తే పేదలకు ఉపయోగకరంగా ఉండడంతోపాటు సర్కార్‌కు మంచి పేరు వస్తుందన్న ఆలోచన చేసింది. ఈ నిర్ణయంతో బహిరంగ మార్కెట్‌లో మేలిమి రకం సన్న బియ్యం ధరలు సైతం దిగొస్తాయని అంచనా వేస్తోంది. ప్రస్తుత వానాకాలంలో పండిన సూపర్‌ ఫైన్‌ బియ్యాన్నే రేషన్‌ షాపుల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!