19-05-2025 NORMAL NEWS 10:18 PM
swarnodayam.com
Telugu Daily News
19-05-2025 10:18 PM By Mandala Yadagiri

పేదవాళ్ళను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది..- హుజురాబాద్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ప్రణవ్..

పేదవాళ్ళను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది..- హుజురాబాద్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ప్రణవ్..
IMG-20250519-WA0160
  • ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరిన ప్రణవ్.
  • ఆరోపణలు కాదు దమ్ముంటే రుజువు చేయి.
  • సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక చిల్లర ఆరోపణలు..
  • ఎమ్మెల్సీ గా,విప్ గా ఉండి కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఒక్కటైనా పంచావా? కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన ప్రణవ్.

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హజురాబాద్: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ వ్యక్తి డబ్బులు తీసుకున్నాడో నిరూపించాలని,చిల్లర ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే రుజువు చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సవాల్ విసిరారు. సోమవారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రూ. 22,48,500 విలువ చేసే 57 మంది లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా తాము పని చేస్తున్నామని, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులను పరిష్కరిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. అభివృద్ధి సంక్షేమంపై మేము దృష్టి పెడుతుంటే పచ్చ కామెర్ల ఉన్నోనినికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు రీల్ స్టార్ కౌశిక్ రెడ్డి కరీంనగర్ వేదికగా బీఆర్ఏస్ పార్టీ నాయకులతో కలిసి మరో డ్రామాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కాంలలో బీఆర్ఎస్ పార్టీ ఆరితేరిందని ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక స్కాంలు చేశారని, ఇప్పుడు అలాంటి స్కాంలకు తావు లేకుండా ప్రజలకు ఉపయోగపడే స్కీంలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజాదరణ పొందుతుంటే అది చూసి ఓర్వలేని కౌశిక్ రెడ్డి చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో చెప్పినట్టుగా స్కాం ఎక్కడ జరిగిందో చూపెట్టాలని, కౌశిక్ రెడ్డి లాగా కమలాపూర్ మండలం గుండేడ్ గ్రామంలో గ్రానైట్ వ్యాపారి దగ్గర స్కాం చేసి డబ్బులు తీసుకున్నట్లు కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, నియోజకవర్గంలో కొత్తగా 2వేల కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, రెండేళ్లు ఎమ్మెల్సీ, విప్ గా ఉండి కనీసం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఒక్కటి అయినా లబ్దిదారులకు పంచావా అని ప్రశ్నించారు?. మొదటి విడతలో 3500 మంది లబ్దిదారులకు రాజకీయాలకు అతీతంగా ఇళ్లు కేటాయించామని,ఈ సందర్భంగా ఇళ్ల ఎంపిక విషయంలో పారదర్శకత పాటించామని, నియోజకవర్గంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్టు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారికి ఇందిరమ్మ ఇళ్లు అల్లాట్మెంట్ కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. రాబోయే రెండు, మూడు నెలల్లో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లు కూడా ప్రారంభం అవుతాయని అన్నారు. గుంట భూమి లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో చోటు కల్పిస్తామని ఇప్పటికే సంబంధిత మంత్రులకు పూర్తి వివరాలు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్, సేవాదళ్, సోషల్ మీడియా, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారులతో కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!