10-07-2025 NORMAL NEWS 04:46 PM
swarnodayam.com
Telugu Daily News
10-07-2025 04:46 PM By Mandala Yadagiri

కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయాల్సిందే..! లేదంటే ఆందోళనలు తప్పవు… – బిఆర్ఎస్ మహిళా నియోజకవర్గ నాయకురాలు పూసల ప్రభావతిరెడ్డి

కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయాల్సిందే..! లేదంటే ఆందోళనలు తప్పవు… – బిఆర్ఎస్ మహిళా నియోజకవర్గ నాయకురాలు పూసల ప్రభావతిరెడ్డి
IMG_20250710_164351

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జులై 10: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపించాలని, తదనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బిఆర్ఎస్ మహిళా నియోజకవర్గ నాయకురాలు పూసల ప్రభావతిరెడ్డి డిమాండ్ చేసారు. గురువారం హుజురాబాద్ లో ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయిందని విమర్శించారు. నాడు ఎన్నికల సందర్భంగా పంటల బీమా అమలు చేస్తాం.. అందులో రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఊదరగొట్టి.. నేడు రెండు సీజన్లు గడిచినా పంటల బీమా ఊసే కాంగ్రెస్ సర్కార్ ఎత్తడం లేదన్నారు. అటు అకాల వర్షాలకు నష్ట పోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వక, ఇటు పంటల బీమా పైసలు రాక రైతన్నను అరిగోస పెడుతున్న రైతు ద్రోహి రేవంత్! అని ఆమె ఆరోపించారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో సాగునీటికి, తాగునీటికి, విద్యుత్ కు ఇబ్బంది లేకుండా చేసారని, నిరుపేద, మధ్యతరగతి జనం కోసం, రైతుల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గురుకుల పాఠశాలలు, దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, కాకతీయ వంటి ఎన్నో పథకాలు అమలు చేసారని గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదని, సంక్షేమ పథకాల అమలు నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రం దివాళా తీసిందని, అప్పు పుట్టడం లేదని, తాము ఏమి చేయలేమని కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారని, రాష్ట్ర ప్రజల మానసిక స్థైర్యాన్ని, రాష్ట్ర విశ్వసనీయతను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆమె ఆరోపించారు. దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధోగతిపాలు చేస్తోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ చూడలేదని ప్రజలు చెప్తున్నారని ప్రభావతిరెడ్డి అన్నారు. ఏడాది కాలం కాకముందే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నేతలను ప్రతినిత్యం విమర్శించడం మానుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని ఆమె సవాల్ చేసారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ హామీ అమలు చేయాలని, మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేసి కార్పొరేషన్ పదవులను మహిళలకు కట్టబెట్టాలన్నారు. ఇప్పటికైనా మహిళలకు మంత్రిమండలిలో, కార్పొరేట్ పదవులలో తగిన ప్రాధాన్యత కల్పించి కాంగ్రెస్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభావతిరెడ్డి సూచించారు.

బిఆర్ఎస్ మహిళా నియోజకవర్గ నాయకురాలు పూసల ప్రభావతిరెడ్డి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!