08-09-2025 NORMAL NEWS 05:55 PM
swarnodayam.com
Telugu Daily News
08-09-2025 05:55 PM By Mandala Yadagiri

ఈ నెల 11నుంచి రాజస్థాన్ జోధ్ పూర్ లో ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ సమావేశాలు.. – జాతీయ కౌన్సిల్ సభ్యుడు బాపురావు

ఈ నెల 11నుంచి రాజస్థాన్ జోధ్ పూర్ లో ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ సమావేశాలు.. – జాతీయ కౌన్సిల్ సభ్యుడు బాపురావు
IMG-20250908-WA0055

దేశవ్యాప్తంగా 500 మంది ప్రతినిధులకు ఆహ్వానం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, సెప్టెంబర్ 08: జర్నలిస్టుల ఉద్యమంలో 75 ఏళ్ళ చరిత్ర కలిగిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) జాతీయ సమావేశాలు ఈ నెల 11, 12, 13 తేదీలలో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరుగుతాయని ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడు బాపురావు తెలిపారు. సూర్య నగరంగా ప్రసిద్దిగాంచిన జోధ్ పూర్ నగరంలో తొలిసారిగా జరుగుతున్న ఈ మూడు రోజుల జాతీయ సమావేశాలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మంది ప్రతినిధులు హాజరవుతారని సోమవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. జోధ్ పూర్ లోని మహేశ్వరి భవన్ (ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ అధ్యక్షుడు దివంగత డాక్టర్ కె.విక్రమ్ రావు స్మారక హాల్) లో 11వ తేదీన రాజస్థాన్ కళా బృందాల సాంస్కృతిక ప్రదర్శనల స్వాగతంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రారంభ సమావేశాల్లో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశాల్లో భాగంగా ”డిజిటల్ యుగంలో జర్నలిజం – మారుతున్న పరిస్థితులు-సవాళ్ళు”అన్న అంశంతో పాటు, ”బ్లాక్ మెయిలింగ్-ఎల్లో జర్నలిజం-తీవ్రమైన ఆందోళన”, ”జర్నలిస్టుల రక్షణ-మీడియా యాజమాన్యాలు, ప్రభుత్వాల పాత్ర”, ”జర్నలిస్టుల విశ్వసనీయత-పత్రికల సామాజిక బాధ్యత” తదితర అంశాలపై ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ప్రసంగిస్తారన్నారు. రెండో రోజు మూడో రోజు జరిగే ప్రతినిధుల సమావేశాల్లో దేశం నలుమూలల నుంచి వచ్చే ఐఎఫ్ డబ్ల్యూజే ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ, వర్కింగ్ కమిటీ సభ్యులు,
జాతీయ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారని, ఆయా రాష్ట్రాల జర్నలిస్టుల సమస్యలపై నివేదికలు సమర్పిస్తారని
చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యలపై సమావేశాల్లో చర్చించడం జరుగుతుందని, ముఖ్యంగా జర్నలిస్టుల రక్షణ చట్టం, సీనియర్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ స్కీం, జర్నలిస్టుల వేజ్ బోర్డు, రద్దయిన రైల్వే రాయితీ పాసుల పునరుద్ధరణ తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని తెలిపారు. ఈ జాతీయ సమావేశాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి 25 మంది ప్రతినిధులు ఈనెల 9న బయలుదేరి వెళుతున్నట్లు ఆయన తెలిపారు.

జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుడుతాడు బాపురావు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!