09-10-2025 NORMAL NEWS 12:18 PM
swarnodayam.com
Telugu Daily News
09-10-2025 12:18 PM By Mandala Yadagiri

కుటుంబ కలహాలతో మనోవేదనతో సిఆర్పిఎఫ్ జవాన్ ఆత్మహత్య.. – తన కూతురును తల్లిదండ్రులే పెంచాలని లేఖలో వెల్లడించడం కంటతడి పెట్టిస్తుంది..

కుటుంబ కలహాలతో మనోవేదనతో సిఆర్పిఎఫ్ జవాన్ ఆత్మహత్య.. – తన కూతురును తల్లిదండ్రులే పెంచాలని లేఖలో వెల్లడించడం కంటతడి పెట్టిస్తుంది..
IMG_20251009_120921

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాను పెరుమండ్ల రాజ్ కుమార్ (38) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కాట్రపల్లి కి చెందిన రాజ్ కుమార్ జార్ఖండ్ రాష్ట్రంలో సిఆర్పిఎఫ్ లో సీనియర్ జవాన్ ఉద్యోగం చేస్తూ, ఇటీవల దసరా సెలవుల సందర్భంగా స్వగ్రామం కాట్రపల్లి కి వచ్చాడు. గత మూడు రోజుల క్రితం అత్తగారింటికి వెళ్లి భార్యను కలిశాడు. అప్పటి నుండి ఇంటికి వచ్చి మౌనంగా ఉంటూ మానసిక ఆందోళనకు లోనైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం సుమారు ఐదు నుంచి ఆరు గంటల మధ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ముందుగానే కొనుగోలు చేసిన నైలాన్ తాడుతో ఇంటి టెర్రస్ లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని జీవితం ముగించుకున్నాడు. ఆ సమయమూలో అతని భార్య, రెండేళ్ల కుమార్తె శ్రీనిక పుట్టింటిలో ఉండగా తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తలుపు వేసి ఉండడంతో పైకి వెళ్లి టెర్రస్ లో చూడగా ఫ్యానుకు ఉరేసుకొని ఉండడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా గుండెలవిసెల రోదించారు. రాజ్ కుమార్ సూసైడ్ నోట్ రాసి తన కుమార్తె శ్రీనిక తన భార్య వద్ద గాని అత్తమామల వద్ద గాని ఉండవద్దని తన తల్లిదండ్రులు పెంచి పెద్ద చేయాలని స్పష్టంగా పేర్కొనడంతో తన భార్యతో తనకున్న విభేదాలను వెల్లడిస్తుంది. రాజ్ కుమార్ ముందుగా ఒక యువతిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న అనంతరం మళ్లీ రెండో పెళ్లి వరంగల్ జిల్లాకు చెందిన యువతీతో పెళ్లి చేసుకోగా ఆమెతో కూడా విభేదాలు రావడంతో జీవితంపై విరక్తి చెంది ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పలువురు భావిస్తున్నారు. ఈ ఘటనపై రాజ్ కుమార్ తండ్రి బిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన విషయాన్ని సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సూసైడ్ నోట్లో తన పై ఆఫీసర్లు ఎవరెవరికి సమాచారం ఇవ్వాలి అనేది స్పష్టంగా సెల్ నెంబర్లతో సహా రాయడం బట్టి చూస్తే తను చనిపోయిన తన కూతురు, తల్లిదండ్రులు గొప్పగా బ్రతకాలని ఓ వ్యక్తిగా పడిన తపన స్పష్టమవుతుంది. అయితే భార్య భర్తల మధ్య తలెత్తిన విభేదాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపితే ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆత్మహత్య చేసుకున్న సిఆర్పిఎఫ్ జవాను పెరుమండ్ల రాజ్ కుమార్ (38) ఫైల్.

చనిపోయే ముందు రాజ్ కుమార్ రాసుకున్న సూసైడ్ నోట్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!