16-10-2025 NORMAL NEWS 02:05 PM
swarnodayam.com
Telugu Daily News
16-10-2025 02:05 PM By Mandala Yadagiri

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్‌కు షాక్

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్‌కు షాక్
IMG-20251016-WA0077

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జరుగనున్న కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చిస్తారా? అనే సందేహం వ్యక్తమౌతోంది.

రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. రిజర్వేషన్లు 50శాతం మించొద్దనే అభిప్రాయం సరికాదని కోర్టుకు వివరించారు. ఇందిరా సహానీ కేసులోనూ 50శాతం పరమితి దాటొచ్చని ఉందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చిందని అభిషేక్ సింఘ్వీ న్యాయస్థానానికి వివరించారు.

రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని.. 3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని వాదించారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీం చెప్పిందని.. సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టేనని వాదనలు బలంగా వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం గురువారం పిటిషన్ ను డిస్మిస్ చేసింది. కాగా, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసిన విషయం తెలిసిందే.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!