05-02-2026 NORMAL NEWS 08:14 AM
swarnodayam.com
Telugu Daily News
05-02-2026 08:14 AM By Mandala Yadagiri

హామీల వర్షం… అమల్లో శూన్యం..బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు ఓటుతో గుణపాఠం చెప్పాలి.. – పట్టణాల అభివృద్ధి నా బాధ్యత. – హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హామీల వర్షం… అమల్లో శూన్యం..బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు ఓటుతో గుణపాఠం చెప్పాలి.. – పట్టణాల అభివృద్ధి నా బాధ్యత. – హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG-20260205-WA0001

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎన్నికల ముందు ప్రజలకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
ప్రజలకు 420 హామీలు ఇచ్చి, 420లా వ్యవహరిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలు, కొత్తపల్లి, ధర్మారం, రామన్నపల్లి వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్స్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. అసాధ్యమైన, అమలుకాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పాలన ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్ర ప్రజలకు కష్టాలే మిగిలాయని విమర్శించారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో రైతును రాజుగా చేసి, తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించారని గుర్తు చేశారు.
దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రైతాంగాన్ని బలోపేతం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినవేనని స్పష్టం చేశారు.

కళ్యాణ్ లక్ష్మి పథకంలో రూ.1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం కూడా రైతులు క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలకు నెలకు రూ.2,500, గ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ, వికలాంగులకు రూ.6,000, వృద్ధులకు రూ.4,000 ఇస్తామని చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పట్టణాల్లో బీఆర్ఎస్ మద్దతుతో కౌన్సిలర్లను గెలిపిస్తే, మిగిలి ఉన్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయడం తన బాధ్యతగా తీసుకుంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కొత్తపల్లిలో బిఆర్ఎస్ అభ్యర్థి గుంటి మల్లమ్మ వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దంపతులకు మంగళ హారతులతో స్వాగతం పలికి సత్కరిస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థిని గుంటి వెంకటమ్మ..

కొత్తపల్లి కార్నర్ మీటింగ్ మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పక్కన బిఆర్ఎస్ అభ్యర్థి గుంటి వెంకటమ్మ

కాంగ్రెస్ గ్యారంటీ కార్డు చూపెడుతూ నిలదీయాలని పిలుపునిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సతీమణి శాలిని రెడ్డి..

ప్రజల వద్దకు వెళ్లి అభివాదం చేస్తూ నమస్కరిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థి గుంటి వెంకటమ్మ మల్లయ్య…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!