02-04-2026 NORMAL NEWS 05:38 PM
swarnodayam.com
Telugu Daily News
02-04-2026 05:38 PM By Mandala Yadagiri

6 గ్యారెంటీలు అమలు చేసి, కెసిఆర్ పథకాలు కొనసాగించాలి. – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

6 గ్యారెంటీలు అమలు చేసి, కెసిఆర్ పథకాలు కొనసాగించాలి. – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG-20260402-WA0133

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీని అమలు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్ మండలం రాజపల్లి, సిర్సపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలకు సర్పంచ్ లు కటుకూరి మల్లారెడ్డి, పోల్సాని రామారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలు అమలు పరచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అలవి కాని పనులు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు విక్రయించిన ధాన్యానికి బోనస్ చెల్లించడంలో తాత్సారం చేస్తోందని అన్నారు. రైతులకు ఒకే విడతలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా కెసిఆర్ ప్రభుత్వం అందించిన ఆర్ధిక తోడ్పాటుకు అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీని రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. వృద్ధులకు 4 వేలు, వికలాంగులకు 6 వేలు పెంచుతామన్న పెన్షన్ గుర్తుకు లేదా అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం రైతాంగానికి యూరియా అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేసి శిద్ధశుద్ధి చాటుకోవాలని సూచించారు. అలాగే హుజూరాబాద్ సమీపంలో చేపట్ట తలపెట్టిన డంపింగ్ యార్డు నిర్మాణం వల్ల వాయు, జల కాలుష్యం ఏర్పడి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు ఏర్పాటు తో వెలువడే విష వాయువుల ప్రభావం వల్ల శ్వాస కోస, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల సోకుతాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హుజూరాబాద్ లో డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టకుండ అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ నెల 3 న హుజూరాబాద్ పట్టణ బంద్ కు పిలుపునిచ్చిన తాను 7, 8 వ తేదీల్లో 48 గంటల పాటు నిరసన దీక్షలో పాల్గొంటానని చెప్పారు. డంపింగ్ యార్డు రద్దు అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని, పార్టీలకు అతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా కలసి రావాలని పిలుపునిచ్చారు. గ్రామ సభల్లో డీఆర్డీఏ పీవో శ్రీధర్, ఆర్డీవో రమేష్ బాబు, ఎంపీడీఓ సునీత తదితర గ్రామ పంచాయతీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

రాజపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..

రాజపల్లి గ్రామ సభలో మాట్లాడుతున్న సర్పంచ్ మల్లారెడ్డి..

ఎమ్మెల్యేను సన్మానిస్తున్న రాజపల్లి సర్పంచ్, పాలకవర్గ సభ్యులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!