08-04-2026 NORMAL NEWS 04:18 PM
swarnodayam.com
Telugu Daily News
08-04-2026 04:18 PM By Mandala Yadagiri

డంపింగ్ యార్డ్ తొలగించే వరకు పోరాటం ఆగదు. – నాపై కోపం ఉంటే అంబేద్కర్ చౌరస్తాలో ఉరి తీయండి…కానీ ప్రజల ప్రాణాలతో ఆటలాడొద్దు. – అఖిలపక్షం కలిసి వస్తే వెనుక నిలబడి సహకరిస్తా. – 24 గంటల దీక్ష విజయవంతం. – ప్రజలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కృతజ్ఞతలు

డంపింగ్ యార్డ్ తొలగించే వరకు పోరాటం ఆగదు. – నాపై కోపం ఉంటే అంబేద్కర్ చౌరస్తాలో ఉరి తీయండి…కానీ ప్రజల ప్రాణాలతో ఆటలాడొద్దు.  – అఖిలపక్షం కలిసి వస్తే వెనుక నిలబడి సహకరిస్తా. – 24 గంటల దీక్ష విజయవంతం. – ప్రజలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కృతజ్ఞతలు
IMG-20260408-WA0106

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష బుధవారం ఉదయం 10 గంటలకు ముగిసింది. నిమ్మరసం సేవించి ఆయన దీక్షను విరమించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, హుజురాబాద్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే డంపింగ్ యార్డ్‌ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరమని అన్నారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదన పూర్తిగా తొలగించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఐక్య పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇద్దరు పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసి రావాలని కోరారు.

ప్రభుత్వం వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే లక్ష మందితో భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. పది రోజుల్లో డంపింగ్ యార్డ్ తొలగించకపోతే హుజురాబాద్ నియోజకవర్గంలోని 107 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు.

“నాపై కోపం ఉంటే అంబేద్కర్ చౌరస్తాలో ఉరి తీయండి కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్న డంపింగ్ యార్డును మాత్రం ఈ ప్రాంతం నుంచి తొలగించాలి” అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తాను ఈ ప్రాంతంలో ఉన్నంతవరకు డంపింగ్ యార్డును రానివ్వనని, అవసరమైతే ప్రాణాలైనా లెక్కచేయకుండా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అఖిలపక్ష నాయకులు కలిసి ముందుకు వస్తే వారి వెనుక ఉండి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.

24 గంటల దీక్ష విజయవంతం

హుజురాబాద్ ప్రజలు, మహిళలు, యువత, వివిధ వర్గాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్ ప్రజల మద్దతుతో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

దీక్షకు మద్దతుగా వచ్చిన సిరసపల్లి, హుజురాబాద్ వాసులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!