Social 1080×1350 • Multi-page
27-07-2026 BREAKING NEWS 11:52 PM
swarnodayam.com
Telugu Daily News

జర్నలిస్టుల హక్కుల కోసం ఢిల్లీలో గళమెత్తిన టీడబ్ల్యూజేఎఫ్ -జంతర్ మంతర్ లో తెలంగాణ జర్నలిస్టుల ధర్నా

జర్నలిస్టుల హక్కుల కోసం ఢిల్లీలో గళమెత్తిన టీడబ్ల్యూజేఎఫ్ -జంతర్ మంతర్ లో తెలంగాణ జర్నలిస్టుల ధర్నా
IMG-20260727-WA0240

స్వర్ణోదయం ప్రతినిధి న్యూఢిల్లీ, జూలై 27:
దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పై తెలంగాణ జర్నలిస్టులు ఢిల్లీలో గళమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పాత్రికేయులు పార్లమెంటు సమీపంలోని జంతర్ మంతర్ లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఇచ్చిన “ఛలో పార్లమెంట్” పిలుపునందుకొని రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఢిల్లీ తరలివచ్చిన పాత్రికేయులు ధర్నాలో పాల్గొని సమస్యలపై గొంతెత్తారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాను ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నాయకులు, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు మారూఫ్ రజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరి పక్షాన తెలంగాణ జర్నలిస్టులు ఢిల్లీలో పార్లమెంట్ వద్ద ధర్నా చేయడం అభినందనీయమని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పాత్రికేయుల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ముందుండి పోరాటం చేయడం గొప్ప విషయమని అన్నారు.

ధర్నా కార్యక్రమంలో జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్టులు కూడా ఈ ధర్నాలో పాల్గొని ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి పాత్రికేయుడి హక్కుల కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ ధర్నాలో ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఉపాధ్యక్షుడు లియాఖత్, సభ్యులు మాన్విక మిశ్రా, ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు కుంచం శ్రీనివాస్, కుడుతాడి బాపురావు, కే. రమాదేవి, జగదీశ్వర్, పద్మనాభ రావు, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల పునరుద్దరణ, రిటైర్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం, జర్నలిస్టుల రక్షణ చట్టం, నేషనల్ మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పునఃసమీక్ష తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లకు అందజేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!