వేములవాడ ఆర్టీసీ డిపోలో కె.జె. రెడ్డి ఘన వీడ్కోలు – 32 ఏళ్ల సేవలకు ఘనంగా సన్మానం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్/వేములవాడ: వేములవాడ TGSRTC డిపోలో 19 ఏళ్లుగా డిస్పాచ్ సెక్షన్లో విశేష సేవలందించిన కంకణాల జలంధర్ రెడ్డి (కె.జె. రెడ్డి) సుదీర్ఘ 32 ఏళ్ల ఆర్టీసీ ఉద్యోగ ప్రస్థానం ముగించుకుని ఘనంగా పదవీ విరమణ పొందారు. హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కె.జె. రెడ్డి 1993లో ఐటీఐ ఫిట్టర్ పూర్తి చేసి ఆర్టీసీలో మెకానిక్గా ఉద్యోగంలో చేరారు.

అంకితభావానికి నిదర్శనం:
డిపో మేనేజర్ బి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. “డ్రైవర్లకు ఏ బస్సులు కేటాయించాలి, బస్సుల మెయింటెనెన్స్ నిర్వహణ ఎలా ఉండాలనే విషయంలో మేము పూర్తిగా కె.జె. రెడ్డి గారిపైనే ఆధారపడేవాళ్లం. ఆయన సమయస్ఫూర్తి, అంకితభావం అసాధారణమైనవి. ఆయన ఖాళీ చేసిన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు” అని కొనియాడారు.


స్వాతంత్ర్య సమరయోధుని కుమారుడిగా..:
సామాజిక కార్యకర్త, జిల్లా అవార్డు గ్రహీత కంకణాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, తమ సోదరుడు అధికారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆర్టీసీకి 32 ఏళ్లపాటు నిష్కళంకమైన సేవలు అందించారని తెలిపారు. ఈ సందర్భంగా కె.జె. రెడ్డి తల్లిదండ్రులు, స్వాతంత్ర్య సమరయోధుడు కంకణాల రాజిరెడ్డి – అహల్య దంపతులను డిపో యాజమాన్యం ప్రత్యేకంగా సన్మానించింది.
కె.జె. రెడ్డి పూర్తి బయోడేటా మరియు సేవలను కొనియాడుతూ పదవీ విరమణ శుభాకాంక్షల పత్రంతో పాటు శాలువాతో డిపో అధికారులు, సహోద్యోగులు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో PRO శ్రీనివాస్ యాదవ్, AMM ఆర్. రాంచందర్, VRO, డిపో కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు మరియు కె.జె. రెడ్డి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

