కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం తాసిల్దార్ కు వినతి.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని
సిపిఎం హుజురాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో నరేందర్ కి మెమోరాండం అందజేశారు.
అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, విదేశీ సిస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని, మేకిన్ ఇండియా, స్టార్ట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఇండియా అంటూ ముద్దు ముద్దు పేర్లతో, అనేక స్కీములు తీసుకువచ్చిన ఆ స్కీములన్ని కూడా స్కాములుగా మారి కార్పొరేట్ కంపెనీలకు బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడుతున్నాయి తప్పితే, దేశంలోని ప్రజానీకానికి యువతకు ఎలాంటి లాభం చేకూర్చలేదని, కాబట్టి ఇప్పటికైనా, పేద,మధ్యతరగతి రైతు,వ్యవసాయ కూలీలు కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం ప్రభుత్వం పని చేయాలని, ఇప్పటికే దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని, మరోపక్క ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి, కుటుంబాల పోషణ జీవనం కొనసాగించడమే కష్టమవుతుందని, అలాగే, లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న కార్పొరేట్ కంపెనీలకు మాఫీలు ప్రకటిస్తుందని, దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న, ఆరు గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని, కేవలం ఉచిత బస్సు మహిళలకు, సన్న బియ్యం,హామీలు తప్పా, మిగతావి అమలు కావడం లేదని ఆరోపించారు.
మండల కేంద్రాలలో ప్రభుత్వ స్కూళ్లలో సిబ్బంది కొరత, టీచర్ల కొరత, ప్రభుత్వ ఆసుపత్రిలో, ప్రభుత్వ వైద్యులు, సమయపాలన పాటించకపోవడం, సరిపడా మందుల సదుపాయం లేకపోవడం, అలాగే ప్రభుత్వానికి ప్రైవేటు స్కూళ్లపై ప్రైవేటు ఆసుపత్రులపై నియంత్రణ లేకపోవడంతో అధిక ఫీజులతో ప్రజలను దోపిడీ గురిచేస్తున్నాయని వీటిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేపట్టాలని, అలాగే గ్రామాలలో రోడ్ల మరమ్మతులు, మురికి కాలువల నిర్మాణాలు, చేపట్టాలని కోరుతూ లేనట్లయితే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల్ని ఐక్యం చేసి సమస్యలపై పోరాడుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు, కొంకట చంద్రయ్య, ప్రతాప శ్రీనివాస్, రాచపల్లి లింగయ్య, ఇమ్మడి దేవయ్య, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

