12-06-2024 NORMAL NEWS 08:02 AM
swarnodayam.com
Telugu Daily News
12-06-2024 08:02 AM By Mandala Yadagiri

బడులే…. పిల్లల భవిష్యత్తుకు బాటలు

బడులే…. పిల్లల భవిష్యత్తుకు బాటలు
IMG-20240612-WA0138

-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

నేటి బాలలే రేపటి పౌరులు అని, వారిని పరిపూర్ణ వ్యక్తులుగా గొప్ప వారిగా తయారు చేసేవి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేవి బడులని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఆయన పాఠ్యపుస్తకాలు యూనిఫాములను పిల్లలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు తమ తల్లిదండ్రుల ఆశలను ఆశయాలను గుర్తేరిగి మంచిగా చదువుకొని గొప్పవారు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన దేశ మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు సైతం చదువుకున్నారని, ఇక్కడ చదివిన అనేకమంది ఇంజనీర్లు, డాక్టర్లు గొప్ప గొప్ప మేధావులు అయ్యారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు చక్కగా పాటించి మంచి మార్కులు సాధించడమే కాకుండా మంచి భవిష్యత్తు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎంతోమంది గొప్ప నాయకులతో పాటు మంచి వృత్తిలో కొనసాగుతున్నారని తెలిపారు. ఈ సంవత్సరం 10వ తరగతిలో హుజురాబాద్ ప్రభుత్వ పాఠశాల 93% ఉత్తీర్ణత సాధించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులను అభినందించారు. వచ్చే ఏడాది వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో కూడా రాణించాలని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనంతో పాటు పుస్తకాలు యూనిఫారాలు కూడా అందిస్తుందన్నారు. ఆటలాడుకోవడానికి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోని మైదానాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని దానిని విద్యార్థులు సక్రమంగా ఉపయోగించుకొని ఆటల్లో దేశం గర్వించే విధంగా రాణించాలన్నారు. విద్యార్థులకు పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తప్పక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, ఎంపీపీ ఇరుమల్ల రాణి సురేందర్ రెడ్డి, తాసిల్దార్ కే విజయ్ కుమార్, ఎంపీడీఓ టి సునీత, మండల విద్యాధికారి కేతిరి వెంకటనరసింహారెడ్డి, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, ముత్యం రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గత ఏడాది పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. విద్యార్థులకు యూనిఫారాలు, పాఠ పుస్తకాలు అందజేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!