19-06-2024 NORMAL NEWS 05:28 AM
swarnodayam.com
Telugu Daily News
19-06-2024 05:28 AM By Mandala Yadagiri

ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు గర్జిస్తాం..ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ఏడు చెరువుల నీళ్లు తాగిస్తాం

ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు గర్జిస్తాం..ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ఏడు చెరువుల నీళ్లు తాగిస్తాం
IMG-20240619-WA0106

-ఆరు నెలల్లో 6 గ్యారంటీలు అమలు కాలేదు, ఆరు స్కాములు మాత్రం జరిగాయి
-హరీష్ రావు పై చిల్లర మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోం
గ్రూప్ వన్ లో వన్ ఈస్ట్ 100 పాటించాలి

-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు గర్జిస్తామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని, మిడిమిడి జ్ఞానంతో హరీష్ రావుపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. హరీష్ రావుపై లేనిపోని విమర్శలు చేయడం మానుకొని పని ఎలా చేయాలో చూసి నేర్చుకోవాలని హితువు పలికారు. హరీష్ రావును విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున హరీష్ రావు తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో మాట్లాడరా తప్పా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదని అన్నారు. గ్రూప్ వన్ కి వన్ ఈస్ట్ 100 పాటించాలని హరీష్ రావు అడగడంలో తప్పేముందని అన్నారు. జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడు అయినప్పటికీ కనీస అవగాహన లేకుండా మాట్లాడడం బాధాకరమన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జీవన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నప్పుడే వన్ ఈస్ట్ 100 కేటాయించిన విషయం మర్చిపోవద్దని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటికి పదిహేను నిష్పత్తి ఉన్నప్పటికీ దానిని కూడా 100కు పెంచారని, తెలంగాణలో కూడా దానిని అమలు చేస్తే తప్పేముందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఉపముఖ్య మంత్రి బట్టి విక్రమార్క కూడా గ్రూప్ వన్ విషయంలో వన్ ఈస్ట్ 100 ఉండాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారని అన్నారు. వెంటనే ప్రభుత్వం వన్ ఈస్ట్ 100 ప్రాతిపదికను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ గడిచిన ఆరు నెలల్లో 6 గ్యారంటీ లాభలు పక్కన పెడితే 6 స్కాములు మాత్రం చేసిందని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో గ్యాస్ సబ్సిడీ రావడం లేదని, దీంతోపాటు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం కూడా పూర్తిస్థాయిలో జరగడంలేదని అన్నారు. సమస్యల అన్నిటిని పరిష్కరించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడు చెరువుల నీళ్లు తాగిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రతి విషయాన్ని తెలంగాణ ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారని సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ తదితరులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!