07-09-2024 NORMAL NEWS 12:16 PM
swarnodayam.com
Telugu Daily News
07-09-2024 12:16 PM By Mandala Yadagiri

వాడవాడన కొలువుదీరిన గణనాథులు.. గణేష్ నామస్మరణతో మార్మోగిన వీధులు

వాడవాడన కొలువుదీరిన గణనాథులు.. గణేష్ నామస్మరణతో మార్మోగిన వీధులు
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్: వినాయక చవితిని పురస్కరించుకుని వాడవాడనా గణనాధులు కొలువు తీరారు. ఉదయం నుండే గణపతి విగ్రహాలను విక్రయదారుల నుండి కొనుగోలు చేసి భక్తిశ్రద్ధలతో వాహనాలల్లో ఊరేగింపుగా మేళ తాళాల మధ్య తీసుకువెళ్లారు. మా బొజ్జ గణపయ్య….
మమ్మేలా రావయ్యా…అంటూ విఘ్నేశ్వరుడికి మహిళా భక్తులు స్వాగతం పలికి హారతులు పట్టారు. వినాయక చవితి సందర్భంగా శనివారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని పట్టణాలు, మండలాలు, గ్రామాలలో వాడవాడలా విభిన్నతమైన ఆకారాల్లో ఉన్న విగ్రహాలను నెలకొల్పి పూజలు చేస్తున్నారు. మండపాలలో గణనాథున్ని ప్రతిష్టించి పూజలు చేసి ప్రణమిల్లారు. రకరకాల నైవె ధ్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జైజై గణేశా..జయములివ్వూ బొజ్జ గణపయ్య…ఉండ్రాలయ్యా…దండాలయ్యా అంటూ నామస్మరణలు చేస్తూ హోరెత్తించారు. విద్యుత్ దీపాలు, షామియానాలతో మండపాలు దేదీప్య మానంగా వెలిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా యువకులు, యువతులు, పిల్లలతో మండపాల వద్ద సందడి నెలకొంది. ఇండ్లలో ఉదయమే పుణ్యస్నానాలు నిర్వహించుకొని వినాయకుల విగ్రహాలను పూజించి పిండివంటలను నైవేధ్యంగా సమర్పించారు. వినాయక వ్రత నియమాలను పాటిస్తూ వ్రత కథ చదివారు. పట్టణంలోని సాయిబాబా గుడి, విద్యానగర్, ప్రతాపవాడ, కాకతీయ కాలనీ, సిద్ధార్థ నగర్ తదితర పలు ప్రాంతాలలో గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు ఏర్పాటు చేసిన భారీ గణనాథులు ఆకట్టుకుంటున్నాయి. కాగా పట్టణంతో పాటు గ్రామాలల్లో గణేష్ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తొమ్మిది రోజులపాటు భక్తులు కొలువనున్నారు. మండపాల వద్ద ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!