14-09-2024 NORMAL NEWS 06:32 AM
swarnodayam.com
Telugu Daily News
14-09-2024 06:32 AM By Mandala Yadagiri

ఒక్క అవకాశం ఇవ్వండి సేవ చేసి చూపిస్తా!

ఒక్క అవకాశం ఇవ్వండి సేవ చేసి చూపిస్తా!
IMG-20240914-WA1722

ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వస్తున్నా

పట్టభద్రులకు న్యాయం జరిగేలా పనిచేస్తా

కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని ఆశిస్తున్నా

ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: రాబోయే పట్టబద్దుల ఎన్నికల్లో తనకు పట్టభద్రులు ఒక్క అవకాశం కల్పించి గెలిపిస్తే సేవచేసి చూపిస్తానని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం హుజురాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎన్నికల కోసం ఓటర్ల ఎన్ రోల్ కార్యక్రమం మొదలుపెట్టానని, డిగ్రీ పూర్తి చేసి మూడు సంవత్సరాలు గడిచిన పట్టబద్రులందరూ ఓటరు గా నమోదు చేసుకోవాలన్నారు. గతంలో ఓట్లు ఉన్న అభ్యర్థి కూడా మరోసారి ఓటరు గా నమోదు చేసుకోవాలన్నారు.

నాలుగు జిల్లాల్లో సుమారు 20 లక్షల మంది పట్టబద్రులు ఉన్నారని, కేవలం లక్ష మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారని మిగతా వారందరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. పట్టభద్రుల అభివృద్ధి కోసం తాను గెలిచిన తర్వాత వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ను చూసి ఆకర్షితునుడై కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నానని అన్నారు. యుపిఎస్సి తరహాలోనే టీపీఎస్సీలో కూడా ఖచ్చితమైన జాబ్ క్యాలెండర్ అమలయ్యేలా చూస్తానన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెండింగ్లో ఉన్న డిఏ గురించి మాట్లాడి అమలయ్యేలా చూస్తానని, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా 12 నెలల జీతం ఇచ్చేలా యాజమాన్యాలతో చర్చిస్తానన్నారు. ప్రైవేట్ ఉద్యోగులందరికీ ఆరోగ్య భరోసా ఇప్పించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. బకాయిలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను కూడా ఇప్పించేలా ముఖ్యమంత్రితో మాట్లాడతానని అన్నారు. దీంతోపాటు తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో యూనివర్సిటీల భూములు కబ్జాకు గురయ్యాయని వాటన్నిటిని హైడ్రా తరహాలో తిరిగి తీసుకువచ్చేలా కృషి చేస్తానన్నారు. తను కేవలం సేవాభావంతోనే రాజకీయాలలోకి వస్తున్నానని, 2018 లోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని గుర్తు చేశారు. ఆ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నానని, ఒకవేళ రాకపోయినా ఇండిపెండెంట్గనైనా పోటీ చేస్తానని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!