
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో తీవ్రంగా కలత చెంది స్మశాన వాటికలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పలువురీని కలచివేసింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

హుజురాబాద్ పట్టణం పోచమ్మవాడకు చెందిన పంజాల బిక్షపతిగౌడ్(48) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో రంగనాయకుల గుట్ట సమీపంలోని హిందూ స్మశాన వాటికలోనీ రేకుల షెడ్డు పైకప్పుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రెండు రోజులుగా గౌడ కులస్తులు రేణుక ఎల్లమ్మ జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమంలో బిక్షపతి గౌడ్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే కుటుంబ కలహాలతో కలత చెందిన బిక్షపతి సాయంకాలం వరకు స్మశాన వాటిక సమీపంలో కల్లు విక్రయించి రాత్రి ఎవరూ చూడని సమయంలో స్మశాన వాటికలోని షెడ్డులో తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రతి వ్యక్తి చనిపోయిన తర్వాత స్మశానానికి వెళ్లాల్సి ఉండగా తను మాత్రం ముందుగానే స్మశాన వాటికకు వెళ్లి అక్కడే ఆత్మహత్యకు పాల్పడడం పలువురిని కలచివేసింది. మృతుడికి భార్య శారద, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు.

ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న పంజాల బిక్షపతిగౌడ్(48)





