
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డ ఈశ్వరమ్మ యాదవును దూషించిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని హుజూరాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ..

స్వాతంత్రము లభించి 79 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బీసీల పైన అగ్రకులాల ఆగడాలు రోజురోజుకు పెచ్చు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి గుడి పాలక వర్గ సభ్యురాలిగా నియమింపబడిన ఈశ్వరమ్మ యాదవ్ సన్మాన కార్యక్రమం ఫ్లెక్సీలో తన పేరును పెట్టలేదన్న అక్కసుతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శివ చరణ్ రెడ్డి ఈశ్వరమ్మ ను దుర్భాషలాడడాన్ని గర్హిస్తూ ఇటువంటి మాటలు మానుకోవాలని శివ చరణ్ రెడ్డిని హెచ్చరించారు. కులపరంగా దూషించిన అతనిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 60 శాతం పైగా ఉన్న బీసీలు ఏకమై ఐకమత్యంతో ముందుకు కదిలినప్పుడు మాత్రమే అగ్రకులాల వారిని ఎదిరించగలుగుతామని అభిప్రాయపడ్డారు. పార్టీలకు, పదవులకు అతీతంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఐకమత్యంతో రాజ్యాధికారాన్ని దక్కించుకున్నప్పుడు మాత్రమే అగ్రకులాలను ఎదిరించే శక్తి పొంద గలుగుతామని ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల బిడ్డలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు వన్నాల శివాజీ, బీసీ జేఏసీ కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, మావునూరి ప్రవీణ్ కుమార్, బీసీ నాయకురాలు దేవసాని ప్రియదర్శిని, కొలిపాక క్రాంతి, ద స్వేరో నాయకులు అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్, ప్రజా సంఘాల నాయకులు రామ్ సారయ్య, గడప రాజు, మేకల రవి, దొంత హరికిషన్, సొల్లు శంకర్, ఊదారపు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.





