
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్:
ప్రజా సమస్యలపై గొంతు విప్పడమే ఆయన చేసిన తప్పా? నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైఫల్యాలను ఎండగట్టడమే నేరమా? అంటే అవుననే సమాధానం వస్తోంది హుజురాబాద్ పరిణామాలను గమనిస్తుంటే. నియోజకవర్గానికి చెందిన నాయకుడు సబ్బని వెంకట్ ఇంటిపై దాడికి తెగబడి, ఆయనపై కుట్రలు పన్నిన ఎమ్మెల్యే అనుచరుల లీలలు ఇప్పుడు పోలీసు కేసు వరకు వెళ్లాయి.


ప్రజాక్షేత్రంలో వచ్చిన ఆదరణే కారణమా?
ప్రాంతీయంగా ప్రజలను పీడిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్యపై సబ్బని వెంకట్ చేపట్టిన ఉద్యమం నియోజకవర్గంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రభుత్వాన్ని సైతం ఆలోచనలో పడేలా చేసి ప్రజల మద్దతు కూడగట్టడంలో వెంకట్ విజయవంతమయ్యారు. అయితే, ఆయనకు వస్తున్న ప్రజాదరణను, రాజకీయ మైలేజ్ను జీర్ణించుకోలేని ప్రత్యర్థులు, వ్యక్తిత్వ హననానికి దిగజారారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ అరంగేట్రానికి ముందే వ్యూహాత్మక దాడి.
గత 2023 సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగుతారేమోననే భయంతో ప్రారంభమైన కుట్రలు, ఇప్పుడు ఆయన రాజకీయ అరంగేట్రం చేయకముందే బురద జల్లే స్థాయికి చేరాయని వెంకట్ మద్దతుదారులు మండిపడుతున్నారు. ఈ కుట్రల వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో, ఈ రాజకీయ కుట్రకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఏది ఏమైనప్పటికి హుజురాబాద్ ఎమ్మెల్యే అనుచరులు హర్షద్, అంజాద్, అర్జున్, మురళిలపై ఈ ప్రాంత యువకులపై హైదరాబాదులో డీజీపీ ఆదేశాలతో కేసు నమోదు చేసే వరకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాదులో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు సబ్బని వెంకట్..





