
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల వివాదంపై స్పందించడానికి నిరాకరించడమే కాకుండా, స్వపక్ష ప్రభుత్వంపైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు గూడూరి స్వామిరెడ్డి వైఖరిని నిరసిస్తూ రేపటి నుంచి దశలవారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు టీయూడబ్ల్యూజేయు (ఐజేయు) ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి కాయిత రాములు, కామని రవీందర్ లు ప్రకటించారు.

గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కెసి క్యాంపులో కేటాయించిన ఇండ్ల స్థలాలపై స్వామిరెడ్డి కోర్టులో కేసు వేసిన నేపథ్యంలో, సమస్యను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఆయన స్వగ్రామమైన ఇప్పల నర్సింగాపూర్ లోని ఆయన గృహానికి వెళ్లి బొకే ఇచ్చి విజ్ఞప్తి చేశారు. అయితే, కేసును ఉప సంహరించుకోవడానికి ఆయన నిరాకరించినట్లు వారు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే గూడూరు స్వామిరెడ్డి స్పందిస్తూ… “ఇదో చెత్త ప్రభుత్వం, ఈ ప్రభుత్వంతో పనులు అయ్యేది లేదు.. పోయేది లేదు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వారు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని రకాల ప్రయోజనాలు పొందిన స్వామిరెడ్డి, సొంత ప్రభుత్వంపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వచ్చాక తన సతీమణి గూడూరు రాజేశ్వరిని హుజురాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నామినేట్ చేయించుకోవడంతో పాటు, ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కోడలు గూడూరు అంజలిని మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా ఎంపిక చేయడంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబుతో పాటు మంత్రుల సహకారాన్ని ఆయన పూర్తిగా వాడుకున్నారని జర్నలిస్టులు గుర్తుచేశారు.
సొంత పదవుల కోసం ప్రభుత్వాన్ని వాడుకుని, జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో మాత్రం పట్టుదలకు పోతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. బొకే ఇవ్వడానికి వెళ్లిన జర్నలిస్ట్ ప్రతినిధుల పట్ల ఆయన వ్యవహరించిన తీరుకు నిరసనగా రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, కార్యదర్శి కామని రవీంద ర్ లు ప్రకటించారు. కాగా దీనిపై స్వామిరెడ్డిని స్వర్ణోదయం వివరణ కోరగా తాను గత ప్రభుత్వము పట్ల విమర్శలు చేశానే తప్ప తన ప్రభుత్వాన్ని విమర్శించలేదని, తనపై పార్టీ విచారణ జరిపితే తగిన వివరణ ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు కోరం సుధాకర్ రెడ్డి, నంబీ భరణికుమార్ , కేదాసి శ్రీధర్, టేకుల సాగర్, ఎడ్ల కుమార్, నిమ్మటూరి సాయికృష్ణ, పబ్బ తిరుపతి, మచ్చిక చందు, గొపగాని మహేష్, ఎన్ టివి రాజు, పోతరాజు సంపత్, నాగవెల్లి రాజు, పయిమ్, భారత రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

స్వామిరెడ్డిని కలిసి కేసు ఉప సంహరించుకోవాలని కోరుతున్న ప్రెస్ క్లబ్ నాయకులు, సభ్యులు..





