
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట), ఆగస్టు 15: దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జమ్మికుంట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫోరం జమ్మికుంట శాఖ అధ్యక్షుడు మద్దూరి శంకరయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం సెక్రటరీ జనరల్, జిల్లా అధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి హాజరై మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం రావడం ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమని అన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు సాగించిన పోరాటం, చేసిన త్యాగాల ఫలితంగానే నేడు స్వరాష్ట్రంలో స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్నామని సంజీవరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
ప్రతి సంవత్సరం ఆగస్టు 15, జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కేంద్రాల్లో నిర్వహించే అధికారిక వేడుకల్లో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి కలెక్టర్ చేతుల మీదుగా గౌరవ సూచకంగా సత్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను అధికారికంగా గౌరవించడం ద్వారా వారి పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేసినట్లవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ రెడ్డి, రచ్చ గణేష్, పాతకాల ఓదేలు, రామ్ రాజబాబు, మోతే స్వామి, ఎగిత కొమురయ్య, ఏబూషి ఓదేలు, గండికోట సమ్మయ్య, రమేష్, బిట్ల శీను, పొడేటి అనిల్, మొలుగు శీను, మోతే రాజు తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.
&& లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: కాకతీయ జూనియర్ కళాశాల హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





