
–అధికారం పోయినా పొగరు వంగలే ..
–కేసు నుంచి తప్పించుకునేందుకే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రాపకానికి తంటాలు..
–అమృత్ టెండర్లు బీఆర్ఎస్ హయంలోనివే ..
–ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై
విమర్శిస్తే సహించేది లేదు..
–కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి కరీంనగర్ : తెల్లాలేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విషం చిమ్మడం మాజీమంత్రి కేటీఆర్ కు అలవాటుగా మారిందని, ఈ పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు హెచ్చరించారు. బుధవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ దమ్ము, ధైర్యం ఉంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని సవాల్ విసిరారు. ఆ దమ్ము లేకనే మహారాష్ట్రలో కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని కేటీఆర్ చెబుతున్నారని, అంటే బిజెపితో వారికి లాలూచీ ఉందన్న విషయం స్పష్టంగా బయటపడు తున్నదని పేర్కొన్నారు. చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన శరత్ పవర్ తరఫునైనా మహారాష్ట్రలో ప్రచారం చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం, లోక్ సభ ఎన్నికల్లో సీట్లు కోల్పోయినా వారిలో పాయచిత్తం కనిపించడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల నాటకాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, అధికారం కోల్పోయినా వారి పొగరు వంగలేదని మండిపడ్డారు. ఉనికిని చాటుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే రోల్ మోడల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్చిదిద్దుతుంటే, బీఆర్ఎస్ నేతలు దీన్ని ఒర్వడం లేదని విమర్శించారు. ప్రజల్లో ఎక్కడ తమ ఉనికి కనపడకుండా పోతుందనే భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ తెచ్చింది అసలైన ఫార్ములా ఈ కాదని అది పెద్ద బోగస్ అని రాజేందర్ రావు ఆరోపించారు.
ఫార్ములా ఈ రేస్ కు 55 కోట్ల కేటాయింపు పై ఏసీబీ కేసు నమోదు, విచారణకు గవర్నర్ అనుమతి కోరడంతో కేటీఆర్ లో భయం పుట్టిందని మండిపడ్డారు. దాన్నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీకి పరుగులు పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రాపకానికి నానా తండాలు పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని నాటకాలు వేసినా కేసు నుంచి తప్పించుకోలేరని, చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని, అది నీడ ఎల్లప్పుడు వెంటాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. అమృత్ 2.0 టెండర్లలో అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికే టెండర్లు ఖరారు అయ్యాయని స్పష్టం చేశారు. అమృత్ 2.0 పనులకు రీటెండర్ పిలిచేలా చేసిందే కేటీఆర్ అని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే ప్రజల్లో ఉన్న పరువు పోవడం ఖాయమని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.
