
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే కార్తీక పౌర్ణమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. కార్తీక మాసం పవిత్రమైన మాసంగా హిందువులు భావిస్తారు. ఈ మాసంలో శివునికి కృష్ణునికి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసoగా ప్రజలు భావిస్తారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రజలు తమ ఇళ్లను చక్కగా అలంకరించుకొని ఇంటిముందు ముగ్గులు వేశారు. తులసి చెట్టు వద్ద ఉసిరి కొమ్మను పెట్టి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. పట్టణంలోని దేవాలయాలకు వెళ్లి ప్రజలు తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు. దేవాలయాల వద్ద గల తులసి చెట్టు వద్ద మహిళలు దీపాలను వెలిగించారు. వేద పండితులకు ఉసిరితో దీపదానం నిర్వహించారు. కార్తీక మాసంలో పవిత్రమైన పౌర్ణమి రోజును పురస్కరించుకొని శుక్రవారం పలువురు తమ ఇళ్ళ వద్ద సత్యనారాయణస్వామి వ్రతాలను ఆచరించుకొని బంధువులు కుటుంబ సభ్యులకు భోజనం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఇంటి ముందు దీపాలను వెలిగించి టపాకాయలను కాల్చారు.






