
– మహిళలకు తండ్రి ఆస్తిలో సమాన వాటా హక్కుల ప్రదాత..
– తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహా నేత ..
– తరం వారికి ఆదర్శప్రాయుడు.
– ఏన్టీఆర్ కు భారత రత్న అవార్డునువ తక్షణమే కేంద్రం ప్రకటించాలి.
– ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
బడుగు, బలహీనవర్గాలకు, మహిళలకు స్వర్గీయ నందమూరి తారకరామారావు చేసిన సేవలు మరువలేనివని, తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ కు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకొని బుధవారం కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పోలాడి రామారావు, రెడ్డి సంఘాల రాష్ట్ర ప్రధానకార్యర్శి సంది తిరుపతిరెడ్డి, ఎన్టీఆర్ అభిమానులు నాయకులతో కలిసిపూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి స్వీట్లు తినిపించకున్నారు. ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషంట్ లకు పోలాడి రామారావు పండ్లు, బ్రెడ్ లు, పాలు పంపిణీ చేసీ వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈసందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ అన్ని వర్గాల పేద ప్రజల అభ్యున్నతి, సంక్షేమానికి, రైతాంగానికి ప్రభుత్వ అధినేతగా అనేక పథకాలు ప్రవేశ పెట్టి పేదలకు పెన్నిధిగా అన్నగా ఎన్టీఆర్ నిలిచారని కొనియాడారు. మహిళలకు తండ్రి ఆస్తిలో సమాన వాటా హక్కులు, స్ధానిక సంస్థల్లో రిజర్వేషన్లు, పేదవాడికి తిండి కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం, ఉండటానికి పక్కా గృహ నిర్మాణ పథకం, కట్టుకోవడానికి జనతా వస్త్రాలు ప్రవేశ పెట్టి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అమలు చేశారన్నారు.
పేద పిల్లల చదువు కోసం తొలుత రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి, స్ధానిక సంస్థల్లో ఎన్నికల్లో దేశంలోనే మొదటి సారి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పించి ఎన్టీఆర్ అమలు చేశారన్నారు. బీసీలలో రాజకీయ చైతన్యం తెచ్చిన గొప్ప మహనీయుడు అన్నారు. ఎన్టీఆర్ సినీరంగంలోనే కాకుండా రాజకీయాలలోకూడా జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తి సాధించారన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటి చెప్పి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ‘తెలుగు దేశం పిలుస్తోంది రా కదలిరా’ అనే నినాదంతో యువతలో మహిళల్లో సామాన్యుల్లో చైతన్యం రగిలించి తొమ్మిది నెలల్లోనేఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కిందని, ఇది దేశ రాజకీయ చరిత్రలోనే లిఖించదగిన పరిణామం అని రామారావు తెలిపారు. సమాజమే దేవాలయం అనే సిద్ధాంతం తో ప్రజలే దేవుళ్ళుగా ఎన్టీఆర్ భావించి రైతుల బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి రాష్ట్రాభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు.
తెలంగాణలో భూస్వామ్య, బడా బూర్జువా వ్యవస్థకు చరమ గీతం పాడే విధంగా పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు, భూ శిస్తు రద్దు చేసి, రైతులకు రాయితీ తో విద్యుత్ సౌకర్యం కల్పించడం,
పంచాయతి సమితి వ్యవస్థలను రద్దు చేసి సామాన్యులకు ప్రజల పాలన అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేసి సామాన్యులకు ఎంతో మేలు చేకూర్చారన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా తెలుగు దేశం స్థాయిలో ప్రజలను ప్రభావితం చేయలేదని, జాతీయ భావాలు కలిగిన ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగు దేశం పార్టీ మాత్రమేనని అన్నారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం, రైతాంగ శ్రేయస్సుకు, తెలుగుజాతి వికాసం కోసం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాభవృద్ధి కోసం జాతీయ భావాలతో అహర్నిశలు కృషి చేసిన స్వర్గీయ నందమూరి తారకరామారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ఇవ్వాలని పోలాడి రామారావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి, నాయకులకు, కార్యకర్తలకు పోలాడి రామారావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామారావు వెంట రెడ్డి జేఏసీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంది తిరుపతిరెడ్డి, నాయకులు పోల్సాని దేవేందర్ రావు, రమేష్, కుమార్, ఎన్టీఆర్ అభిమానులు తదితరలు పాల్గొన్నారు.




ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషంట్ లకు పోలాడి రామారావు పండ్లు, బ్రెడ్ లు, పాలు పంపిణీ చేస్తున్న దృశ్యం