
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రజలందరికీ ఓటు హక్కు కలిగి ఉండేలా చూడాల్సిన బాధ్యత మనదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో బిఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్.ఐఆర్ ఓటర్ నమోదు, బిఎల్ ఎ విధులపై అవగాహనపై సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలసి బిఆర్ ఎస్ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ… ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ ఐఆర్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటర్ల లిస్టు సవరణ కార్యక్రమంలో భాగంగా నిజమైన ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత బిఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు. ఓటర్ నమోదు ప్రక్రియపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, నిజమైన ఓటర్లను బిఎల్ఎ లు నమోదు చేసే విధంగా చూడాలని కోరారు. మృతిచెందిన వారి ఓటర్ల పేర్లను మాత్రమే తొలగించేలా చూసుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్. ఐఆర్ పై ఓటర్ నమోదు కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.

—పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
-ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
పార్టీ ఆదేశానుసారం హుజురాబాద్ నియోజకవర్గంలో నూతన సభ్యత్వాలను చేర్పించడం ద్వారా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయికి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. పార్టీ బలోపేతంలో కార్యకర్తల పాత్ర కీలకమని చెప్పారు. ప్రజలకు పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరించి అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయించాలని కోరారు. రెండున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజలకు మరింత వివరించాలన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత అది మరిచిపోయిన విషయాలపై ప్రజలకు గుర్తు చేయాలన్నారు. ప్రజలను మభ్యపెట్టి అడ్డగోలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన నయవంచనపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ప్రచారం చేయాలన్నారు. గతంలో మాదిరిగా హుజురాబాద్ నియోజకవర్గంలో గులాబీ సేన మరింత పటిష్టంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ దిలీప్ కుమార్, నాయకులు పింగిలి రమేష్, ముసిపట్ల తిరుపతిరెడ్డి, కన్నురు సత్యనారాయణరావు, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, వర్దినేని రవీందర్ రావు, సురేందర్ రెడ్డి, సంఘం ఐలయ్య, గందే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.





