
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ఈ నెల 21న హైదరాబాద్లో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని తెలంగాణ ఉద్యమకారులందరూ విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చెల్పూరు మధు అన్నారు.

ఆదివారం హుజూరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ….. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేకే కమిటీ తెలంగాణ ఉద్యమకారులకు వెంటనే సమగ్ర న్యాయం చేయాలని అన్నారు. త్వరలో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, తిమ్మాపూర్ తదితర మండలాల్లో తెలంగాణ ఉద్యమకారుల సంఘ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పార్టీలకు అతీతంగా అసలైన ఉద్యమకారులంతా సంఘంలో చేరి తమ హక్కుల సాధనకు కృషి చేయాలని కోరారు. నకిలీ ఉద్యమకారులను ఏరివేసి, అసలైన ఉద్యమకారులకు గుర్తింపు లభించేలా సంఘం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగా తెలంగాణలో కూడా ఉద్యమకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో నమోదైన పోలీసు కేసుల కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
అనంతరం తెలంగాణ ఉద్యమ నాయకుడు గుండారపు సతీష్ మాట్లాడుతూ…. నకిలీ ఉద్యమకారులను తప్పనిసరిగా గుర్తించి తొలగిస్తామని తెలిపారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా అసలైన ఉద్యమకారులను గుర్తించి భూమితో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు అందించి జీవనోపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు మోతె రమేష్, ఏం రాజయ్య, చంద్రశేఖర్, ఈ రాజు, డి హరీష్ పాల్గొన్నారు.





