
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బొల్లారంలో వేములవాడ – సిరికొండ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బొల్లారం నుండి సిరికొండ వరకు రూ.23కోట్ల సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నిధులతో చేపట్టబోయే రహదారి విస్తరణ పనులకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ తో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ శంకుస్థాపన చేయడం జరిగింది.


ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా రహదారి విస్తరణ, బలోపేతం తోపాటు మధ్యమధ్యలో సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణం, పైప్ కల్వర్టుల నిర్మాణం, గ్రామాల పరిధిలో సీసీ, డ్రైన్ల ఏర్పాటు, రోడ్డు భద్రతా చర్యలకు సంబంధించిన పనులు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ రోడ్డు నిర్మాణంతో మామిడిపల్లి, బావుసాయిపేట, రామన్నపల్లి, గోవిందరావుపేట తండా గ్రామాల ప్రయాణికులకు, వాహనదారులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. కాగా బండి సంజయ్ కుమార్ ను పలువురు నేతలు ఘనంగా సత్కరించారు.







