
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణ శివారులో ఉన్న గుండ్ల చెరువు ఎఫ్ టిఎల్ లో పోసిన మట్టి కుప్పలను తొలగించి, రైతులను, కాలనీలను ముంపు బారినుండి కాపాడాలని కోరుతూ గురువారం హుజురాబాద్ తహసీల్దార్ జే నరేందర్ కు ముదిరాజ్ కులస్తులు, ప్రజాసంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత కొంతకాలంగా గుండ్ల చెరువులో పక్కనే భూములు కలిగిన కొందరు వాల్టా చట్టానికి విరుద్ధంగా చెరువు ఎఫ్ టిఎల్ లో మట్టిని నింపి కట్టలు ఏర్పాటు చేశారని, దీనివల్ల వర్షాకాలంలో నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి రోడ్డు పక్కనున్న పలు కాలనీలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చెరువులో సరిపడ నీరు చేరకుండానే మత్తడి పైనుండి నీరు ఆయకట్టు పొలాలలో ప్రవహించి పైరు దెబ్బతినడమే కాకుండా భూమి కూడా గుంతల మాయమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కొంతమంది చర్యల మూలంగా గుండ్ల చెరువు ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. గుండ్ల చెరువు ఉనికికే ఇబ్బందిగా మారుతున్న మట్టి కుప్పలను తక్షణమే తొలగించి చెరువును కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య, నాయకులు పిల్లి సమ్మయ్య, ఎంపటి శంకర్, ముషం తిరుపతి, ఎర్ర సంజీవ్, రొంటల దేవదాస్, బొడ్డు రాజు తదితరులు పాల్గొన్నారు.






