
—కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి.
—రైతు విద్యుత్ మూడో డిస్కంను రద్దు చేయాలి – లేబర్ కోడ్లను కొనసాగించాలి – ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించాలనీ సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల హుజురాబాద్ మండల సంయుక్త సదస్సు నేడు హుజురాబాద్లోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు.

రైతులకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ విద్యుత్ మూడో డిస్కం (Third Discom) ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ విద్యుత్ను కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి నెట్టే చర్యలను రైతాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు.
కార్మికుల న్యాయ హక్కులను పరిరక్షించే నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, వాటిని యథావిధిగా కొనసాగించాలి అని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయపరమైన హక్కులను బలహీనపరిచే చర్యలను నిలిపివేయాలని కోరారు.
అలాగే వీబీజీ (VBG) – రాంజీ పథకాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGS) యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు జీవనాధారమని, దానిని బలహీనపరిచే లేదా ప్రత్యామ్నాయ పథకాలతో నిర్వీర్యం చేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని అన్నారు.

రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల హక్కులను కాపాడేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కదిరే రమేష్, దండిగారి సతీష్,ఇమ్మడి దేవయ్య, కొడిమెల వెంకటేష్, ఆకునూరి సుధాకర్, శనిగరపు కొమురయ్య, నవీన్, శ్రీకాంత్, ఉమా, మాట్ల చిరంజీవి, మహేష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.





