
—హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
—ఎస్ఐఆర్ ప్రక్రియ, ప్రజావాణి, భూ భారతి దరఖాస్తులపై సమీక్ష..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, జూలై 31: ప్రజలకు సంబంధించిన ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు.


శుక్రవారం రాత్రి హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆమె కార్యాలయ పనితీరును పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, అనంతరం ఆర్డీవో జల కుమారి, తహసీల్దార్ నరేందర్తో సమావేశమై డివిజన్ పరిధిలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్షించారు.


ఈ సందర్భంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతిపై ఆరా తీశారు. ఇంటింటి సర్వే, దరఖాస్తుల పరిశీలన, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని ఆర్డీవోకు సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు.
అదేవిధంగా ప్రజావాణిలో అందుతున్న వినతులు, భూ భారతి–సాదా బైనామా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పరిష్కార ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన దరఖాస్తుదారులకు ఎలాంటి జాప్యం లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
డివిజన్ పరిధిలో పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు, తాగునీటి సరఫరా, వర్షాకాలంలో చేపడుతున్న ముందస్తు చర్యలపై కూడా కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు.





