
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన రాగం గౌతం అనే యువకుడు శనివారం పంచాయతీ పెద్దమనుషులు చేసిన అవమానంతో మనస్థాపంకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం…. రాగం గౌతంకు సోదరుడు రాగం రాజుకు మధ్య ఆస్తి వివాదం నడుస్తుంది. ఈ విషయంపై పెద్దమనుషుల వద్ద పంచాయతీ జరిగింది. పంచాయతీ సమయంలో పెద్దమనుషులకు జమానతు కింద కొంత డబ్బు పెద్ద మనుషులకు ఇచ్చాడు. అయితే రెండు నెలలుగా పంచాయతీ చేయకపోవడంపై పెద్దమనిషి తోకల తిరుపతికి గౌతమ్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో పెద్దమనిషి తిరుపతి తన తమ్మునికి మద్దతుగా వ్యవహరిస్తూ, తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల అవమానకరమైన మాటలు, బూతులు మాట్లాడాడని దీంతో మనస్థాపానికి గురైన గౌతం శనివారం యాదవ సంఘం చీటీ పాడే వద్ద గ్రామస్తుల కళ్ళముందే పెద్దమనుషుల తీరును నిరసిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గౌతం భార్య మనీషా జరిగిన సంఘటనపై మీడియాకు వివరించి రాతపూర్వకంగా పంచాయతీ పెద్ద మనిషి తిరుపతి, మరిది రాజు బూతు పురాణం భరించలేకనే తన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐ కరుణాకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

జరిగిన సంఘటనపై సిఐ కరుణాకర్ కి వివరిస్తున్న బాధితురాలు మనీషా..





