
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని హుజురాబాద్ క్లబ్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అత్యంత ప్రమాదకరంగా మారిందని సామాజిక కార్యకర్త, స్థానిక 13వ వార్డ్ కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఎలాంటి రక్షణ లేకపోవడంతో చిన్న పిల్లలు సైతం లోపలికి వెళ్తున్నారని, ఇది ఏ క్షణమైనా పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
కేవలం ఒక్క క్లబ్ ముందే కాకుండా, హుజురాబాద్ పట్టణంలో అనేక చోట్ల ఇదే తరహాలో రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్లు దర్శనమిస్తున్నాయని ఆయన తెలిపారు.

ప్రధాన డిమాండ్లు:
- ప్రమాదకరంగా ఉన్న అన్ని ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ వెంటనే సురక్షితమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి.
- లోపల వర్షపు నీరు నిలవకుండా, విద్యుత్ షాక్ ప్రమాదాలు తగ్గించేలా స్టోన్ కంకర పోయించాలి.
- అనాధికార వ్యక్తులు, పిల్లలు లోపలికి వెళ్లకుండా పటిష్టమైన గేట్లను ఏర్పాటు చేసి తాళాలు వేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.

విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ చర్యలు చేపట్టి, పట్టణ ప్రజల, ముఖ్యంగా చిన్నారుల ప్రాణాలను కాపాడాలని రవీందర్ రావు విజ్ఞప్తి చేశారు.





