
స్వర్ణోదయం ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా, సురక్షితంగా మరియు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు నిర్వాహకులు, ప్రజలు పోలీస్ శాఖ సూచించిన నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ గారు సూచించారు.
గణేష్ ఉత్సవ నిర్వాహకులు పాటించాల్సిన ముఖ్య సూచనలు…
—గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు పోలీస్ క్లియరెన్స్ కోసం పూర్తిగా నింపిన ఇంటిమేషన్ ఫారంను తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాలి. ప్రతిష్ఠాపన స్థలం, తేదీతో పాటు నిమజ్జన ఊరేగింపు తేదీ, సమయం, మార్గం, నిమజ్జన ప్రదేశం వివరాలను స్పష్టంగా పేర్కొనాలి.
- విగ్రహ ప్రతిష్ఠాపన స్థల యజమాని నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తప్పనిసరిగా పొందాలి. ప్రైవేట్ లేదా ప్రభుత్వ స్థలం అయినా ఈ నిబంధన వర్తిస్తుంది.
- ట్రాఫిక్కు అంతరాయం కలగని, ప్రజా శాంతిభద్రతలకు ఎలాంటి ముప్పు లేని ప్రదేశాల్లోనే విగ్రహాలను ప్రతిష్ఠించాలి. వివాదాస్పద ప్రదేశాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనకు పోలీస్ క్లియరెన్స్ ఇవ్వబడదు.
- గణేష్ మండపాల్లో అనధికారిక విద్యుత్ కనెక్షన్లు వినియోగించరాదు. విద్యుత్ సరఫరా కోసం T.G.S.P.D.C.L. ద్వారా అధీకృత విద్యుత్ కనెక్షన్ పొందాలి. సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని ఇంటిమేషన్ ఫారంతో పాటు సమర్పించాలి.
- లౌడ్స్పీకర్ల వినియోగాన్ని 2 బాక్స్ టైప్ స్పీకర్లకు మాత్రమే పరిమితం చేయాలి. డీజేలకు అనుమతి లేదు.
- రాత్రి 10:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు లౌడ్స్పీకర్లు లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లను వినియోగించరాదు.
- ఇంటిమేషన్ ఫారంతో పాటు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత గడువులోపు తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.
- పోలీస్ క్లియరెన్స్లో పేర్కొన్న నిబంధనలు, నిమజ్జన మార్గం, సమయాలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలి.
- ప్రతి గణేష్ మండపం వద్ద CCTV కెమెరాలు, వీడియో కెమెరాలు ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలి.
- ఉత్సవాల సందర్భంగా అసభ్యకర నృత్యాలు, అభ్యంతరకర పాటలు లేదా కార్యక్రమాలు నిర్వహించరాదు. భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించాలి.
- ప్రతి గణేష్ మండపం వద్ద సైబర్ అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేసి, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ చెల్లింపుల భద్రత, OTPలు, PINలు, పాస్వర్డ్లను ఇతరులతో పంచుకోకపోవడం, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
ప్రజలకు పోలీస్ శాఖ విజ్ఞప్తి….
గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా, సురక్షితంగా, సామరస్యపూర్వకంగా నిర్వహించేందుకు ఉత్సవ నిర్వాహకులు, స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు, శాంతి కమిటీ సభ్యులు, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లా పోలీస్ శాఖ కోరింది.
ప్రజా శాంతిభద్రతలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భక్తుల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పోలీస్ శాఖ జారీ చేసిన నిబంధనలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది.
@@ లోకల్ యాడ్స్ @@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: హుజురాబాద్ పురపాలక సంఘం సానిటరీ విభాగం ఉద్యోగులు, సిబ్బంది.





