
స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్:
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘటన..
కరీంనగర్ టు నిజామాబాద్ ప్రధాన రహదారిలో క్రాసింగ్ ల వద్ద కనీసం వేగం తగ్గించని ఆర్టీసీ డ్రైవర్లు…వరుస ఘటనలు జరిగినా మారని తీరు..
కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి నిజామాబాద్ కి వెళ్లే ప్రధాన రహదారిలో ఆర్టీసీ డ్రైవర్ల దూకుడు ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఈరోజు ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ మండలంలోని శాత్రాజ్ పల్లిలో వేడుకలకు హాజరైన సత్తెవ్వ అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తిరిగి ఇంటికి వెళ్తుండగా కొత్తపల్లి సమీపంలోని వెలిచాల క్రాసింగ్ వద్ద ఒక్కసారిగా దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అయితే ఇదే రహదారిపై పలుమార్లు వరుస ఘటనలు జరుగుతున్న అటు ఆర్టీసీ ఉన్నతాధికారులు కానీ… ఇతర పోలీస్ సిబ్బంది కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమీప గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రధాన క్రాసింగ్ ల వద్ద బోర్డులను ఏర్పాటు చేసి వేగం తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడాలని పలువురు కోరుతున్నారు.
