
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన పొలసాని కార్తీక్ రావు (26) అనే యువకుడు అప్పుల బాధ భరించలేక కన్నవారికి విషయం చెప్పుకోలేక, జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి తనువు చాలించాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కార్తీక్ రావు హైదరాబాదులో టెక్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవించేవాడు. ఆదివారం నాడు కార్తీక్ తండ్రి పొలసాని సంపత్ రావు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోదామని రమ్మంటే ఉద్యోగం చేసే ఆఫీసులో సెలవు దొరకదని, నేను రాను మీరు పోయి రండి అని చెప్పాడన్నారు. తిరుపతిలో ఉన్నప్పుడు కార్తీక్ తన తండ్రికి ఫోన్ చేసి అర్జెంటుగా 50 వేల రూపాయలు కావాలని అడిగాడని, వచ్చినంక ఇస్తా అని చెప్పి జాతర చూసుకుని ఇంటికి వచ్చామన్నారు. బుధవారం వచ్చి ఉదయం చూడగా కార్తీక్ రాత్రి పురుగుల మందు తాగి ఇంటిముందు మంచం మీద చనిపోయి పడి ఉన్నాడన్నారు. ఫోన్ చెక్ చేయగా తనకు అప్పులు ఇచ్చినవారు ఫోన్లు చేసి అడగడంతో వారి బాధ భరించలేక, అప్పు తీర్చలేననే బెంగతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సమగ్ర విచారణ జరుపుతునట్లు పోలీసులు తెలిపారు.
