
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల కర్త పీవీ నరసింహారావు 103వ జయంతి ఉత్సవం పివి హుజురాబాద్ జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఘనంగా నిర్వహించారు. ముందుగా పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ బీమోజు సదానందం మాట్లాడుతూ హుజురాబాద్ లో పీవీ నరసింహారావు ఉన్నత విద్యను అభ్యసించి ఈ ప్రాంతానికి వన్నె తెచ్చారు. హుజురాబాద్ నుండి ఢిల్లీ వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించారన్నారు. హుజురాబాద్ పాత తాలూకా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన కేంద్రంగా ఉండేదని ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న 14 మండలాలకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పీవీ నరసింహారావు పేరుతో హుజురాబాద్ ను జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని పీవీ నరసింహారావు పేరుతో హుజురాబాద్ ను వెంటనే జిల్లాగా ప్రకటించి ఈ ప్రాంత ప్రజలకు పివి కున్న అనుబంధాన్ని మరింత అభివృద్ధి చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సైదాపూర్ మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకటరాజం, తాటిపల్లి రాజన్న, డాక్టర్ విష్ణుదాస్ గోపాలరావు, వేల్పుల రత్నం, చందుపట్ల జనార్ధన్, తునికి సమ్మయ్య , డాక్టర్ తడికమళ్ళ శేఖర్, సందెల వెంకన్న, అన్నాడి సత్తిరెడ్డి, రాం సారయ్య, రాo రాజేశ్వర్, ఠాకూర్ శివ దయాల్ సింగ్, ఎలబోతారం మాజీ సర్పంచ్ నమిండ్ల రవీందర్, కొయ్యడ అంజి, మార్త రవీందర్, లంకదాసరి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.






