
-కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ జులై 1: కల్యాణ లక్ష్మి చెక్కల పంపిణి విషయమై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఉన్న కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా కల్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వకుండా అధికార పక్షం కట్టడి చేసింది. స్వయంగా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఫోన్ చేసి ఎమ్మెల్యే కు చెక్కులు ఇవ్వొద్దు.. మీరే చెక్కులు ఇవ్వండి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ వాయిస్ రికార్డ్ కూడా లీక్ అయింది. దీంతో కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కౌశిక్ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ప్రభుత్వ జీవోలో ఉన్న ప్రకారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 75 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సోమవారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా అయన చాలా ఉద్వేగంగా ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వడం లేదని, ఈ పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారని, పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా కేసీఆర్ ఆదుకున్నారని తెలిపారు. ఏదైనా కక్ష్య ఉంటే నా పై తీర్చుకోవాలి కానీ, నియోజకవర్గ ప్రజలపై కాదని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేస్తానని అయన స్పష్టం చేసారు. త్వరలోనే మిగిలిన హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాలకు చెందిన లబ్దిదారులకు 400 కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కౌశిక్ స్థానిక ఆర్డీవోను ఆదేశించారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకున్నప్పటికీ ఎమ్మెల్యే కౌశిక్ కోర్టుకు వెళ్లి.. పట్టుబట్టి కల్యాణలక్ష్మి చెక్కులు లబ్దిదారులకు పంపిణీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కౌశిక్ తన దృష్టిలో పడితే వదలడు.. ఎంతకైనా తెగిస్తాడు సాధించి తీరతాడు. ఇది అయన నైజం.. మంత్రిని కూడా న్యాయపరంగా ఎదుర్కొని చెక్కులు ఇచ్చి తన పంతం నెగ్గించుకున్నారని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

