
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ జులై 09: హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ప్రభుత్వము తరపున మంత్రి కొండా సురేఖ మంగళవారం ఉదయం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే పట్టువస్త్రాల సమర్పణ సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు, మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ నిర్వాహకులు, అధికారులు పొన్నం, మేయర్ ను రిసీవ్ చేసుకోవటంలో నిర్లక్ష్యం వహించారు. ఈ సమయంలో స్వల్ప తోపులాట చోటు చేసుకోవటంతో మేయర్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ప్రోటోకాల్ రగడ వివాదం తలెత్తింది. ఆలయ నిర్వాహకులు, అధికారుల తీరుపై ఆగ్రహంతో ఆలయం బయట పొన్నం, మేయర్ బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో పాటు ఆలయ చైర్మన్, ఆలయ నిర్వాహకులు అక్కడకు చేరుకొని వారిని సముదాయించి లోపలికి తీసుకెళ్లారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న పొన్నమును నగరానికి ప్రతిమ పౌరురాలుగా ఉన్న మేయర్ ను ఉత్సవ నిర్వాహకులు ప్రోటోకాల్ ప్రకారం గౌరవించలేదని అధికారంలో ఉండి అలగడం చర్చనీయాంశంగా మారింది.








