
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని మూడు వార్డులకు చెందిన సుమారు 5వేల మంది ప్రజలకు నిత్యం తాగునీరు అందించే 70 ఏళ్ల క్రితం బావి నేడు కురుస్తున్న వర్షాలకు ధరిలు కూలి శీతిలం కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. హుజురాబాద్ పట్టణంలోని మామిళ్ల వాడలో బుచ్చి రాములు బావిగా పిలవబడే 70 ఏళ్ల క్రితం తవ్విన ఆ బావి అప్పుడు పంట పొలాలకు ఉపయోగించగా క్రమేణా పంట భూములు నేడు నివేషణ స్థలాలుగా మారడంతో చుట్టు ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. అనంతర క్రమంలో ఆ బావి వేలాదిమంది ప్రజల దాహార్తిని తీర్చేదిగా మారింది. క్రమంగా ఆ బావి మామిళ్ళవాడ, గ్యాస్ గోదాం, జండాగద్దే ఏరియా, ఉర్దూ భవన్ వాడ, మోడల్ చెరువు ఏరియా, జూనియర్ కళాశాల ఏరియా తదితర ప్రాంతాల ప్రజలకు తాగునీటి వసతి కల్పించింది. అలాంటి బావిని నాటి మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గం బుచ్చిరాములు బావిని గ్రామపంచాయతీకి అద్దెకు తీసుకొని సమీప ప్రజలకు తాగు నీరు అందించేందుకు మోటార్లు బిగించి ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల వర్షాల తాకిడికి భావి చుట్టూ నీరు నిలిచి ధరులు కూలడంతో పాటు మురుగు కాలువ నీరు సైతం అందులో చేరి దుర్వాసన వెదజల్లుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలియగానే నిన్న సాయంత్రం నుండి నేటి ఉదయం వరకు మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, సమీప వార్డు కౌన్సిలర్లు మారపల్లి సుశీల, బర్మావత్ యాదగిరి నాయక్, ఉజ్మా నూరిన్ ఇమ్రాన్, మున్సిపల్ , విద్యుత్ సిబ్బంది తదితర ప్రజాప్రతినిధులు పరిశీలించి బావి చుట్టూ మోరం పోయించారు. బావికి ఉన్న విద్యుత్ కనెక్షన్ తొలగించి భావి దగ్గరికి ఎవరు వెళ్లకుండా భారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేశారు. ఏదిఏమైనాప్పటికీ 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ బావి పూర్తిస్థాయిలో శిథిలం కాగా తక్షణమే అక్కడ బావిని తొలగించి ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా, ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడాలని ఆయా వార్డుల ప్రజలు కోరుతున్నారు.








