
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల శాతం పెరగనున్నది. బీసీ గణన పూర్తయిన తర్వాతనే ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపక్ష పార్టీలతో పాటు బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ గణన పూర్తయిన తర్వాతనే ఎన్పికలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, బీసీ గణన చేపడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో గ్రామపంచాయతీ ఎన్నికలను చేపట్ట లేదు. బీసీ గణన చేపట్టేందుకు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్డడంతో సభ ఆమోదం పొందింది. బీసీ గణన బీసీ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టాల్సి రావడంతో కొత్త కమిషన్ నియమించే వరకు బీసీ గణన మొదలు కాలేదు. ఈలోపు కనీసం పాత రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలనైనా నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, బీసీ గణన పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ మొదలయ్యింది. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టు నెలాఖరుతో ముగియడంతో ఈనెలాఖరులోగా ప్రభుత్వం కొత్త కమిషన్ను నియమించనున్నది. ఆ వెంటనే బీసీ గణనకు కసరత్తు చేపట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. రెండు మాసాల్లో బీసీ గణన పూర్తిచేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత డేటాను క్రోడీకరించిన తర్వాత వాటి ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచి ఎన్నికలను నిర్వహించనున్నారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరగగా, ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీతో పదవీ కాలం ముగిసింది. ఈ స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49.5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. బీసీలకు 27 శాతమే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీ గణనతో బీసీలకు మరిన్ని స్థానాలు పెరగనున్నాయి. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆలస్యమైనా, బీసీ గణన పూర్తయిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీ గణన చేపట్టకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీల్లో వ్యతిరేకత వస్తుందనే కారణంగా బీసీ గణన చేపట్టిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి 8న ప్రకటించిన అసెంబ్లీ ఓటర్ల జాబితాను అనుసరించి గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 6వ తేదీన జాబితాను ప్రకటించనుండగా, 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీరించనున్నారు. 19వ తేదీ వరకు వాటిని పరిష్కరించి 21వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు. బీసీ గణనతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెరగనుండడంతో బీసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.







