
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఓ పసికందును వదిలేసి వెళ్లిన కర్కశమైన ఓ మాతృమూర్తి.. అమ్మ తనానికే మాయని మచ్చ! తెచ్చింది. హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామశివారులోని హనుమాన్ దేవాలయం కాకతీయ కెనాల్ వద్ద పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. వివరాల్లోకెళ్తే.. ఇదే గ్రామానికి చెందిన గుండేటి చొక్కారెడ్డి అనే వ్యక్తి తన టాక్టర్ ను కడగడానికి కాలువలోకి తీసుకెళ్లాడు. అక్కడే చిన్న చెట్టు వద్ద పసికందు గొంతు వినిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా బట్టల్లో చుట్టి చిన్న సంచిలో ముళ్ళు కట్టిన దానిలో పసికందు లభ్యమైoది. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చాడు. ప్రాణంతో ఉండడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టౌన్ సిఐ తిరుమల్ సంఘటన స్థలానికి చేరుకొని తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించి బాబు పుట్టి 24 గంటలు అవుతుందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. ఏసీపి శ్రీనివాస్ జి, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు, ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాబు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనల మేరకు శిశువుని కరీంనగర్లోని మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని తరలిస్తామని పోలీసులు తెలిపారు.







