
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో ఉదయం వాకింగ్ చేసే వారికి, ఆటలాడుకునే వారికి, సమీపంలో ఓపెన్ జిమ్ చేసే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు పేర్కొన్నారు. రాత్రి వేళలో కొందరు యువకులు ఓపెన్ క్రీడా మైదానంలో బర్త్డే దావతులు చేసుకోవడం, బహిరంగంగా మద్యం సేవించడం, వ్యభిచారం నిర్వహించడం తదితర సాంఘిక కార్యకలాపాలకు నిత్యం పాల్పడుతూ ఉండడంతో పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేగాక మద్యం సేవించిన తర్వాత సీసాలను పగలగొట్టడంతో ఉదయం వాకింగ్ వెళ్లేవారు పగిలిన గాజు ముక్కలతో నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం మైదానంలో మద్యం సీసాలు, ప్లాస్టిక్ పేపర్లు, గ్లాసులు, కండోమ్ లు బహిరంగంగా ఓపెన్ జిమ్ పక్కన, వాకింగ్ ట్రాక్ పైనా పడేస్తుండడంతో నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు వాకర్స్ తెలిపారు. ఈ విషయం కళాశాల నిర్వాహకులు మున్సిపల్, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదని వాపోయారు. మున్సిపల్, పోలీస్ అధికారుల, సిబ్బంది నిర్లక్ష్యంతోనే నిత్యం క్రీడా మైధానంలో నిఘా కొరవడి అసాంఘిక కార్యకలాపాలు యదేచ్చగా కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికైనా మునిసిపల్, పోలీస్ సిబ్బంది పట్టించుకుని కళాశాల క్రీడా మైదానంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు వాకర్స్, క్రీడాభిమానులు కోరుతున్నారు.





