
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మండలంలో సిర్సపల్లి -రంగాపూర్ గ్రామాల మధ్య అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అనుమతి లేకుండా మట్టి తవ్వుతున్న ప్రాంతానికి రెవెన్యూ అధికారులు వెళ్లి జెసిబి, ట్రాక్టర్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అక్కడ మొత్తం 12 టిప్పర్లు రెండు జెసిబిలు మట్టి తవ్వకాలు చేస్తున్నాయి. సమాచారం అందుకున్న రెవిన్యూ అధికారులు శేఖర్, రంజిత్ రెడ్డిలు సంఘటన స్థలానికి వెళ్లి మట్టి తరలిస్తున్న వ్యక్తుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలను పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మిగతా వాహనాల వారు అక్కడి నుండి పరారైనట్లు వారు తెలిపారు. కాగా మంగళవారం మిగతా వాహన యజమానులపై పోలీస్ స్టేషన్లో రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. మట్టి తవ్వకాలు అనుమతి లేకుండా చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా మట్టి మాఫియా పెద్ద ఎత్తున జరుగుతున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు చూసి చూడనట్లుగా వదిలేయడంలో ఆంతర్యమేమిటో అని పలువురు ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.













