
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ నవంబర్ 29: హుజూరాబాద్ పట్టణ శివారు జమ్మికుంట రోడ్ లోని సిర్సపల్లిక్రాస్ రోడ్డు వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర సూపర్ మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి షట్టర్ తాళాలు పగలగొట్టి నిత్యవసర వస్తువులను చోరీ చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం శ్రీ రాజరాజేశ్వర సూపర్ మార్కెట్ దుకాణం తెరిచేందుకు దుకాణ యజమాని సంతోష్ వెళ్లగా, షెట్టర్, దాని తాళాలు పగలగొట్టి ఉండడం గమనించామన్నారు. షాపు లోపల చెల్లాచెదురుగా పడిన కిరాణ సామాన్లు ఉండటం, దాదాపు లక్షా యాభైవేల విలువ కలిగిన బియ్యం బస్తాలు, నూనె పీపాలు, సిగరెట్ ప్యాకెట్లు, పప్పులు, ఇతర విలువైన నిత్యవసర వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారన్నారు. కేసు నమోదు చేసుకొని, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. రాత్రి వేళలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు సమీపంలో సంచరించిన, కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కాగా దుకాణ నిర్వాహకులు అక్కడ ఉండరని తెలుసుకొని అందులో ఉండే వస్తువుల అన్ని వివరాలు తెలిసిన వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక సెటరు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడడం ఒకరితో కాదని ఈ దొంగతనంలో ముగ్గురు వ్యక్తుల వరకు పాల్గొని ఉంటారని పలువురు భావిస్తున్నారు.







