
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి (దామెర), జనవరి 07 :దామెర మండలం ఊరుగొండ లక్ష్మీనర్సింహస్వామి అధ్యయన కల్యాణ మహోత్సవాలు ఈ నెల 7 నుంచి జరుగనున్నాయి. స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వాహకులు 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిం చనున్నారు. ఈ క్రమంలో జనవరి 7 నుంచి 18 వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్న అధ్యయన కల్యాణ మహోత్సవాలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకోనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకోనున్నారు. ఉత్సవాలకు లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా ఊరుగొండ గ్రామానికి చెందిన గొంది నర్సింహారెడ్డి(ఎస్ఆర్ఎ) తమ తల్లిదండ్రులు గొంది నర్సమ్మ-మల్లారెడ్డి (జీఎన్ఎం) జ్ఞాపకార్థం కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు చేపట్టారు. ఊరుగొండలోని ప్రధాన దేవస్థానంతో పాటు గ్రామ సమీపంలోని గుట్ట వద్ద ఉన్న దేవాలయానికి సున్నంతో పాటు రంగులు వేయడం వంటి పనులను పూర్తి చేయించారు. అయితే దామెర మండలంతో పాటు ఆత్మకూరు, శాయంపేట, పరకాల, నడికూడ తదితర మండలాలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి, స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటారు. కాగా భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

