
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గాలిపటాల విక్రయదారులు చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళవారం పలు కిరాణాల్లో తనిఖీ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో చాలామంది గాలిపటాలను ఎగరవేయడం ఆనవాయితీగా వస్తుండడంతో ముందస్తుగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. చైనా మాంజలు ఉపయోగించడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయన్నారు. కొన్ని సందర్భాల్లో మాంజాతో ప్రజలతో పాటు పక్షుల ప్రాణానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా గాలిపటాలు ఎగరవేసే సమయంలో పక్షులు గాలిపటం సమీపంలోకి వచ్చినప్పుడు మాంజాలు వాటికి తాకి మరణించిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన మాంజాను హుజురాబాద్ లో అమ్మకం చేస్తే వారిపై కేసు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై యునస్ అహ్మద్ అలీతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










