
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని, మంత్రులు ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చినట్లుగా కనిపిస్తుందని కేంద్ర మంత్రి, బిజెపి జాతీయ నాయకుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో..ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క తప్పు చేయాలని అంటే… ఐఏఎస్ లు మూడు తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. సీఎంగా ఉంటూ అవినీతిని, తప్పులను నిరోధించాల్సింది పోయి తప్పులు చేయాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే అవినీతి, తప్పులు జరుగుతున్నాయని ఒప్పుకున్నట్లు ఉందన్నాడు. తదుపరి టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లోని బీజేపీ మండలాధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తోపాటు ఎంపీలు రఘునందన్ రావు, జి.నగేశ్, ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల శంకర్, పాల్వాయి హరీష్ బాబు మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, బొడిగె శోభ, జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రుల మధ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందన్నారు. కొందరు మంత్రులు సొంత దుకాణాలు ఓపెన్ చేసి ప్రతి పనికి 15 శాతం చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ బాకీల సర్కార్
రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.56 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు స్కూటీ, తులం బంగారం, ప్రతి ఉద్యోగికి పీఆర్సీ, 4 డీఏలు, రైతులకు రైతు భరోసా, బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే బా … సర్కార్ అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా బాకీల కాంగ్రెస్ సర్కార్ ను బండకేసి బాదాలని పట్టభద్రులకు టీచర్ లకు పిలుపునిచ్చారు.
–మీ దమ్ము చూపించండి
బీజేపీ కొత్త మండలాధ్యక్షుడిగా నియమితులైన తరువాత తొలిసారిగా ఎదురవుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ దమ్ము చూపించండని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సూచించారు. పీపుల్స్ పల్స్ సహా అనేక సర్వే సంస్థలు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరకక బయట నుంచి అద్దెకు అభ్యర్థులను తెచ్చుకున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదు…ఈసారి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవడం తథ్యం అని స్పష్ట చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత నుండి మళ్లీ అధికారంలో వచ్చేదాకా రాష్ట్రంలో బీజేపీయే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించబోతోందని తెలిపారు.
–ఓట్లు అడిగే హక్కు బీజేపీకే ఉంది
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఒక్క బీజేపీకే ఉందన్నారు బండి సంజయ్. నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగుల పక్షాన నిరంతరం కొట్లాడి జైలుకు పోయింది మేమే. 317 జీవోపై దీక్ష చేస్తే నా ఆఫీస్ గేటును గ్యాస్ కట్టర్లతో కట్ చేయించి టియర్ గ్యాస్ వదిలి అద్దాలు పగలకొట్టి లాఠీఛార్జ్ చేయించారు. అద్దాలు కాలికి గుచ్చుకుని రక్తమోడుతున్నా కనికరం లేకుండా బరబరా గుంజుకుపోయి జైలుకు పంపారు.
–మాట ఇస్తే తప్పం
మోదీ ప్రభుత్వం మాట ఇస్తే తప్పదని, 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాట ఇచ్చి ఏ చిన్న పొరపాటు లేకుండా నయాపైసా అవినీతి లేకుండా ఇప్పటికే 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసి అపాయిట్ మెంట్ లెటర్లు ఇచ్చిన ఘనత బీజేపీదేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఉద్యోగులందరికీ 12 లక్షల 75 వేల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఇచ్చిన ఘనత మోదీ సర్కార్ దేనని తెలిపారు. ముస్లింలను బీసీల్లో కలిపి అన్యాయం చేస్తున్నారు. కొందరు క్రైస్తవులు ఎస్సీ సర్టిఫికేట్లు తీసుకుంటూ ఎస్సీలకు నష్టం చేస్తున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా బీసీ, ఎస్సీ సంఘాలేం చేస్తున్నాయి? ఎందుకు స్పందించడం లేదు? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడమే మీ పనా? అని ప్రశ్నించారు. ఒక వర్గానికి కొమ్ముకాయాలని హిందూ సమాజానికి తీరని నష్టం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులంతా గుణపాఠం చెప్పాలని కోరారు.
ఉద్యోగుల పీఆర్సీ, టీఏ, డీఏల కోసం, ప్రతినెలా జీతాలివ్వాలని కొట్లాడి ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ ను ఇందిరా పార్క్ కు గుంజుకొచ్చిన చరిత్ర బీజేపీదే. గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన కొట్లాడింది బీజేపీయే. కాంగ్రెస్ ఎన్నడైనా కొట్లాడిందా? ఆ పార్టీ నాయకులు టీచర్లు, నిరుద్యోగుల కోసం ఎన్నడైనా జైలుకు వెళ్లారా? ఆనాడు తపస్ మినహా ఏ ఉపాధ్యాయ సంఘమైనా టీచర్లకు అండగా నిలిచాయా? ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజల పక్షాన పోరాడినందుకు ఇయాళ బీజేపీలో ఒక్కో కార్యకర్తపై 10కిపైగా కేసులు నమోదయ్యాయని అన్నారు.
